దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ సహా 10 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఏప్రిల్ 7 నుంచి 9 మధ్య దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఉరుములు, వడగళ్ల వానలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరిక జారీ చేసింది. ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, బీహార్, రాజస్థాన్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఈశాన్య భారతదేశంలో బలమైన గాలులు, వర్షంతో కూడిన వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఎక్కడెక్కడా అంటే…
ఏప్రిల్ 7న కాశ్మీర్ లోయలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఏప్రిల్ 7 నుంచి 9వ తేదీల మధ్య రాజస్థాన్, ఢిల్లీ-ఎన్సీఆర్, హర్యానా, పంజాబ్, హిమాచల్, ఉత్తరాఖండ్, పశ్చిమ యూపీలో భారీ వడగళ్ల వాన, వర్షం కురవచ్చు.
ఏప్రిల్ 6 నుంచి 8వ తేదీ వరకు బీహార్, జార్ఖండ్లో చెదురుమదురుగా వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉంది.
ఏప్రిల్ 8న పశ్చిమ మధ్యప్రదేశ్లో వడగళ్ల వాన సంభవించవచ్చు.
ఏప్రిల్ 7, 8 తేదీల్లో ఉప-హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కింలో వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉండగా.. ఏప్రిల్ 8-9 తేదీల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదే సమయంలో ఏప్రిల్ 9 వరకు మధ్య, తూర్పు, దక్షిణ భారతదేశంలో కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది.
రాబోయే ఏడు రోజుల పాటు దేశంలోని చాలా ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా ఉంటాయి. దీనివల్ల వేడి నుంచి ఉపశమనం లభించినప్పటికీ.. వర్షం, వడగళ్ల వానతో రైతులకు నష్టం కలిగించవచ్చు.
