Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ 6 రోజుల పర్యటన కోసం అమెరికా వెళ్లారు. శాన్ ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్, న్యూయార్క్ నగరాల్లో పర్యటించనున్నారు. ఈ రోజు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా విద్యావేత్తలతో మాట్లాడనున్నారు. ఈ పర్యటనలో ప్రవాస భారతీయులు, అమెరికా చట్ట సభ సభ్యులతో భేటీ కానున్నారు. ఈరోజు శాన్ఫ్రాన్సిస్కోలో జరిగిన ఓ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ మాట్లాడుతూ.. తమకు అన్నీ తెలుసు అనుకునే సమూహం భారతదేశాన్ని నడుపుతోంది, ప్రధాని నరేంద్ర మోడీని దేవుడితో కూర్చోబెడితే.. విశ్వం ఎలా పనిచేస్తుందో దేవుడికే వివరిస్తారంటూ, దీనికి దేవుడే గందరగోళపడతాడంటూ ఎద్దేవా చేశారు.
Read Also: Asaduddin Owaisi: దమ్ముంటే చైనాపై సర్జికల్ స్ట్రైక్స్ చేయండి.. కేంద్రానికి ఓవైసీ సవాల్..
భారత జోడో యాత్రను ఆపేందుకు బీజేపీ ప్రభుత్వం అన్ని ఏజెన్సీలను దుర్వినియోగం చేసిందని అన్నారు. దేశాన్ని ఒక్కతాటిపైకి తెచ్చేందుకే జోడో యాత్రను ప్రారంభించామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అన్ని విశ్వాసాలను, విభిన్న మతాల ప్రజల మధ్య ప్రేమ, ఆప్యాయత విలువను నమ్ముతుందని రాహుల్ గాంధీ అన్నారు. భారత్ జోడో యాత్ర ఆప్యాయత, గౌరవం మరియు వినయం యొక్క స్ఫూర్తిని కలిగి ఉంది. చరిత్రను అధ్యయనం చేస్తే, గురునానక్ దేవ్ , గురు బసవన్న, నారాయణ గురు సహా ఆధ్యాత్మిక గురువులందరూ ఇదే విధంగా దేశాన్ని ఏకం చేశారని అన్నారు. ప్రాంతీయ భాషలపై దాడి చేయడాన్ని మేము అనుమతించమని, ఇలా చేస్తే ఇది భారత్ పై దాడి అవుతుందని ఆయన అన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కులగణన చేపడుతామని రాహుల్ గాంధీ అన్నారు. బీజేపీ కుల గణాంకాలను విడుదల చేయదని, దళితులు, గిరిజనులు, మైనారిటీల పట్ల ప్రేమగా వ్యవహరించాలని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇదే విధంగా చేస్తామని ఆయన తెలిపారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, కోపం, ద్వేషం వంటి సమస్యలను ప్రధాని నరేంద్రమోడీ అతని ప్రభుత్వం పరిష్కరించలేదని.. అందుకే రాజదండం అంటూ సాకులు చెబుతుందని ఆయన పార్లమెంట్ లో సెంగోల్ ను ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేశారు.