గురువారం తెల్లవారుజామున బీహార్లోని ముజఫర్పూర్లోని ఓ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు పది మంది రోగులు మరణించినట్లు అధికారులు తెలిపారు. రక్షించిన పలువురు రోగుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ముజఫర్పూర్లోని బ్రహ్మపురలో ఉన్న ప్రసాద్ ఆసుపత్రిలో తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించి , ఆసుపత్రి ప్రాంగణమంతటా భయాందోళనలు నెలకొన్నాయి. ఐదవ అంతస్తులోని ఐసీయూ వార్డులో ఈ మంటలు చెలరేగాయి. విషపూరిత పొగ వేగంగా ఆసుపత్రి మొత్తాన్ని కమ్మేసింది.
ప్రాథమిక సమాచారం ప్రకారం, షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనలో 20 మందికి పైగా రోగులు గాయపడగా, వారిని సురక్షితంగా తరలించారు. తెల్లవారుజామున 3 గంటలకు మంటలు చెలరేగగా, ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే, దాదాపు డజను అగ్నిమాపక వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. అగ్నిమాపక బృందం మంటలను ఆర్పేసి రోగులను బయటకు సురక్షితంగా తరలించాయి.
10 మంది మృతి
ఈ ఘటనను వివరిస్తూ అగ్నిమాపక అధికారి ఆర్.ఎన్. పాండే మాట్లాడుతూ, “తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఆసుపత్రిలో అగ్నిప్రమాదం గురించి మాకు కాల్ వచ్చింది. మా బృందం అక్కడికి చేరుకునేసరికి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఐసీయూ వార్డు మొత్తం దట్టమైన నల్లటి పొగతో నిండిపోయింది” అని అన్నారు. 20 మందికి పైగా రోగులను సురక్షితంగా రక్షించడం ఊరట కలిగించే విషయమని, అయితే 10 మంది మరణించినట్లు నివేదికలు వచ్చాయని అధికారి తెలిపారు.
ఆసుపత్రి సిబ్బంది పారిపోయారని ఆరోపణలు
ఈ ఘటన అనంతరం ఆసుపత్రి యాజమాన్యంపై ప్రజాగ్రహం వెల్లువెత్తింది. ఘటనా స్థలంలో ఉన్న రోగుల బంధువులు, ఆసుపత్రి యాజమాన్యం బాధ్యత లేకుండా ప్రవర్తించిందని ఆరోపించారు. బాధితుల్లో ఒకరు ఏడుస్తూ, తన తండ్రి ఐసీయూలో చేరారని, ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారని వివరించారు. ఘటన జరిగిన తర్వాత, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది అందరూ రోగులను వదిలి అక్కడి నుంచి పారిపోయారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
