NTV Telugu Site icon

Himachal HC: ప్రభుత్వ పాఠశాలలో టీచర్ కుమారుడి పెళ్లి.. చీవాట్లు పెట్టిన హైకోర్టు

Sonweddingschool

Sonweddingschool

ప్రభుత్వ పాఠశాలలో కుమారుడి పెళ్లి జరిపించిన టీచర్‌కి హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు చీవాట్లు పెట్టింది. ఈ పరిణామాన్ని తీవ్రంగా మందలించింది. ప్రభుత్వ పాఠశాలలో పెళ్లి ఎలా జరిపిస్తారంటూ న్యాయస్థానం నిలదీసింది. విచారణ సందర్భంగా టీచర్ క్షమాపణ చెప్పారు. నాలుగు వారాల్లోగా పాఠశాల క్యాంపస్‌లో రెండు వాటర్ ప్యూరిఫైయర్‌లను ఏర్పాటు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.

ఇది కూడా చదవండి: Pawan Kalyan: హైడ్రా వ్యవస్థపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

నవంబర్ 5, 2021న హమీర్‌పూర్ జిల్లాలోని సుల్గావాన్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల జహు కలాన్‌లో పని చేస్తున్న టీచర్.. కుమారుడి వివాహాన్ని జరిపించారు. అయితే ఈ ఘటనపై స్థానికంగా ఉండే శశికాంత్.. పాఠశాల అడ్మినిస్ట్రేషన్ మరియు బ్లాక్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌కు ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేశాడు. అలాగే ముఖ్యమంత్రి హెల్ప్‌లైన్‌లో కూడా ఫిర్యాదు చేశాడు. నవంబర్ 8న బ్లాక్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (బీఈఈవో) విచారణకు వచ్చినప్పుడు ఫిర్యాదు సరైనదేనని తేల్చారు. కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని అధికారులు తెలిపారు. సీఎం హెల్ప్‌లైన్ నుంచి కూడా అస్పష్టమైన సమాధానం వచ్చింది. దీంతో శశికాంత్ సమాచార హక్కు చట్టం ద్వారా వాస్తవాలను సేకరించాడు. అనంతరం 2022, ఏప్రిల్‌లో ఆయా పత్రాలతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఎలాంటి రాజకీయ, ప్రైవేట్ కార్యక్రమాలను అనుమతించబోమని 2012లోనే హైకోర్టు ప్రకటించింది. పిటిషన్‌లో రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి, డైరెక్టర్‌, డిప్యూటీ డైరెక్టర్‌, బీఈఈవో, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, వివాహానికి ఆతిథ్యమిచ్చిన మహిళా టీచర్‌ను ప్రతివాదులుగా చేర్చాడు. అయితే ఈ కేసు గత వారం విచారణకు రాగా.. టీచర్ హైకోర్టు ముందు క్షమాపణలు చెప్పారు.

ఇది కూడా చదవండి: Ministry of Defence: సుఖోయ్ ఇంజిన్‌ల కొనుగోలుకు ప్రభుత్వం ఆమోదం.. 26 వేల కోట్ల ఒప్పందంపై సంతకం

దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ అజయ్ మోహన్ గోయల్ నాలుగు వారాల్లోగా పాఠశాలలో రెండు ఆర్‌వో వాటర్ ప్యూరిఫైయర్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో తదుపరి విచారణను అక్టోబర్ 18కి ధర్మాసనం వాయిదా వేసింది. పదవీ విరమణ చేసిన ప్రధానోపాధ్యాయుడిని కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. తదుపరి విచారణలో విద్యాశాఖ అధికారుల ప్రమేయాన్ని కూడా కోర్టు పరిశీలించనుంది. ప్రధానోపాధ్యాయుని ప్రస్తుత చిరునామాను రెండు రోజుల్లోగా అందించాలని అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారంటూ రిటైర్డ్‌ హెడ్‌మాస్టర్‌కు ఎందుకు శిక్ష విధించకూడదని న్యాయస్థానం ప్రశ్నించింది.

ఇది కూడా చదవండి: Indian Hockey Team: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో మెరిసిన భారత హాకీ జట్టు.. జపాన్‌పై విజయం