Hathras stampede: ఉత్తర్ ప్రదేశ్ హత్రాస్ తొక్కిసలాట దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. మతపరమైన ధార్మిక కార్యక్రమానికి లక్షల్లో జనాలు హాజరుకావడం ఒక్కసారిగా తొక్కిసలాట జరగడంతో 120 మంది చనిపోయారు. హత్రాస్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్(ఎస్డీఎం) ఈ సత్సంగ్కి అనుమతి మంజూరు చేశారు. అయితే, ఆయన మాట్లాడుతూ.. నారాయన్ హరి ‘భోలే బాబా’ వ్యక్తిగత భద్రతా సిబ్బంది నెట్టివేయడంతోనే తొక్కిసలాట జరిగిందనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఇదే తొక్కిసలాటకు పరిగొల్పి ఉండోచ్చని అన్నారు.
Read Also: UP Bhole baba: హత్రాస్ భోలే బాబాపై లైంగిక వేధింపుల కేసులు.. బ్యాగ్రౌండ్ ఇదే!
‘‘భోలే బాబా మధ్యాహ్నం 12.30 గంటలకు వేదిక వద్దకు చేరుకున్నారు, కార్యక్రమం గంట పాటు సాగింది. బాబా వేదిక నుంచి బయలుదేరినప్పుడు, ప్రజలు అతని ఆశీర్వాదం కోసం అతని వైపు రావడం ప్రారంభించారు. అప్పటిచకే పెద్ద సంఖ్యలో ప్రజలు రహదారి డివైడర్పై నిలబడి ఉన్నారు. బాబా వైపు పరిగెత్తడం ప్రారంభించారు. అతడి వద్దకు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నంలో భోలే బాబా సెక్యూరిటీ, ఇతర అనుచరులు వారిని నెట్టారు’’ అని ఎస్డీఎం తన నివేదికలో పేర్కొన్నారు.
తోసుకోవడంతో పలువురు కిందపడిపోవడంతో భయాందోళనకు గురై జనం అదుపుతప్పారని, ఈ నెట్టివేత నుంచి బయటపడాలని ప్రజలు బహిరంగ మైదానం వైపు పరుగులు తీశారు. ఆ సమయంలో వాలుగా ఉన్న ప్రాంతంలో ప్రజలు జారి పడిపోయారు. మిగతా వారు వారిపై నుంచి పరిగెత్తడంతోనే ఘోర విషాదం చోటు చేసుకున్నట్లు రిపోర్టులో పేర్కొన్నారు. ఈవెంటన్ నిర్వాహకులపై కేసు నమోదు కాగా, ఎఫ్ఐఆర్లో నిందితుల జాబితాలో భోలే బాబా పేరు లేదు. పరారీలో ఉన్న ముఖ్య సేవాదార్ దేవప్రకాష్ మధుకర్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చారు.