Love jihad: ప్రేమ ముసుగులో కొందరు మతమార్పిడికి పాల్పడుతున్న సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. పెళ్లికి ముందు వరకు ప్రేమగా నటిస్తూ, పెళ్లి తర్వాత మతం మారాలని ఒత్తిడి తెస్తున్నారు. దీనిని బీజేపీ, ఇతర హిందూ సంస్థలు ‘‘లవ్ జిహాద్’’గా పేర్కొంటున్నాయి. ఇలాంటి మోసపూరిత వివాహాలకు అడ్డుకట్ట వేయడానికి గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Read Also: Pakistan: ప్రాణాల కోసం ఏడుస్తున్న పాక్ సైనికులు.. BLA కొత్త వీడియో..
పారిపోయి వచ్చిన జంటలకు రిజిస్ట్రేషన్ వివాహాలకు సంబంధించి మార్పల్ని ప్రకటించింది. రాష్ట్ర అసెంబ్లీలో హోం మంత్రి హర్ష్ సంఘవి మాట్లాడుతూ.. ఇలాంటి వివాహాల నమోదు నియమాలు ఇకపై కఠినతరం చేస్తున్నట్లు ప్రకటించారు. వివాహాల పవిత్రతను కపాడటానికి చట్టాలలో కొన్ని మార్పులు చేయాలని రాష్ట్రంలోని పలు సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.
ప్రేమకు వ్యతిరేకం కాదని చెబుతూనే, ప్రేమ పేరుతో దుర్వినియోగానికి పాల్పడే వారిని, సమాజానికి హాని కలిగించే వారిపై చర్యలు తీసుకోవడానికి కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. ‘‘ నిజం, ప్రేమ అన్ని సంప్రదాయాలకు పునాది. ఇది మోసం అయితే సమాజ పతనానికి దారి తీస్తుంది. లవ్ జిహాద్ మన సంస్కృతిపై, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. భారతదేశ వివాహ సంప్రదాయాలను, విలువల్ని రక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాబోయే 30 రోజుల్లో కొత్త నిబంధనల్ని ప్రవేశపెడుతాం. 30 రోజుల్లో ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటాం’’ అని హర్ష్ సంఘవి అన్నారు.
