Supriya Sule: ఫోన్‌పే, గూగుల్‌పే పేలబోయే “టైమ్ బాంబులు”.. పార్లమెంట్‌లో సంచలన వ్యాఖ్యలు..

Supriya Sule

Supriya Sule

Supriya Sule: ఎన్సీపీ-శరద్చంద్ర పవార్ ఎంపీ సుప్రియా సూలే పార్లమెంట్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. గూగుల్ పే, ఫోన్‌పే యాప్‌లు పేలబోయే టైమ్ బాంబులు ‘‘టిక్కింగ్ టైమ్ బాంబ్స్’’గా శుక్రవారం ఆరోపించారు. మనీలాండరింగ్ తనిఖీలు చేయడానికి కేంద్రం ఏ చర్యలు తీసుకుందో చెప్పాలని ఆమె కోరారు. లోక్‌సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘‘భారత ఆర్థిక వ్యవస్థ శ్వేతపత్రం’’పై జరిగిన చర్చ సమయంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

Read Also: Chiranjeevi: గవర్నర్ తమిళిసైని కలిసిన పద్మవిభూషణ్ చిరంజీవి దంపతులు..

సుప్రియా సూలే మాట్లాడుతూ.. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్(PPBL) ఏం జరిగినా.. అది చాలా ఆందోళనకరమైనదని, మనీలాండరింగ్ లాంటిదని అన్నారు. ఫిబ్రవరి 29 నుంచి కస్టమర్ ఖాతాలు, వాలెట్లు, ఫాస్ట్‌ట్యాగ్‌లలో డిపాజిట్లు, టాప్-అప్స్ స్వీకరించవద్దని ఆర్బీఐ ఆదేశించిన నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. మార్గదర్శకాలను పాటించకపోవడంతో ఆర్బీఐ ఈ చర్యలు తీసుకుంది. గూగుల్ పే, ఫోన్ పే రెండు టిక్కింగ్ టైమ్ బాంబులని, ఈ రెండింటిని విస్తృతంగా వాడుతున్నప్పుడు BHIM యాప్‌ని ఎవరూ ఉపయోగించరని అన్నారు. డిజిటల్, క్యాష్ లెస్ ఎకానమీ కోసం ప్రభుత్వం ఏం చేస్తోందని ఆమె ప్రశ్నించారు.

ప్రతిపక్ష ఎంపీలపై ప్రభుత్వం ఈడీ, సీబీఐ, ఐటీలతో దాడులు చేస్తోందని జేఎంఎం ఎంపీ విజయ్ కుమార్ హన్స్‌దక్ ఆరోపించారు. ఈడీ వల్లే బీజేపీ ప్రభుత్వం నడుస్తోందని దుయ్యబట్టారు. 10 ఏళ్ల యూపీఏ హయాంలో సగటు వృద్ధి 6.8 శాతం ఉండగా, ఎన్డీఏ హయాంలో 5.9 శాతం ఎందుకు పెరిగిందో వివరించాలని అసదుద్దీన్ ఓవైసీ ప్రభుత్వాన్ని కోరారు.