FASTag Major Changes: ఫాస్టాగ్‌ విధానంలో సంచలన మార్పులు.. నితిన్‌ గడ్కరీ కీలక వ్యాఖ్యలు

Nitin Gadkari

Nitin Gadkari

FASTag Major Changes: దేశవ్యాప్తంగా హైవేలపై ప్రయాణించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కలిగించే నిర్ణయం తీసుకోబోతోంది. ఇకపై టోల్ ప్లాజాల వద్ద పొడవైన క్యూలలో నిలబడే రోజులు ముగియనున్నాయి. వాహనం ఆపకుండా ప్రయాణం కొనసాగుతుండగానే టోల్ చార్జీలు ఆటోమేటిక్‌గా కట్ అయ్యే కొత్త విధానాన్ని ప్రభుత్వం అమలు చేయడానికి సిద్ధమవుతోంది. కేంద్ర రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ విషయాన్ని వెల్లడించారు. లాజిస్టిక్స్ పవర్ సమ్మిట్ అండ్ అవార్డ్స్ 2026 కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, డిసెంబర్ 2026 నాటికి అనేక జాతీయ రహదారులపై అవరోధ రహిత టోల్ వ్యవస్థను అమలు చేయాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు.

టోల్ ప్లాజాల వద్ద ఇక ఆగాల్సిన అవసరం లేదు
ప్రస్తుతం టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్ ఉన్నప్పటికీ వాహనాలు కొంతసేపు ఆగాల్సి వస్తోంది. అయితే కొత్త విధానంలో వాహనం నేరుగా ప్రయాణిస్తుండగానే టోల్ కట్ అవుతుంది. దీని వల్ల సమయం ఆదా కావడంతో పాటు ట్రాఫిక్ సమస్య కూడా తగ్గుతుంది.

AI + FASTag టెక్నాలజీతో కొత్త వ్యవస్థ
ఈ కొత్త టోల్ విధానంలో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR), RFID ఆధారిత ఫాస్టాగ్ టెక్నాలజీని వినియోగించనున్నారు. హైటెక్ కెమెరాలు వాహన నంబర్ ప్లేట్లను స్కాన్ చేస్తాయి. ఆ తర్వాత ఫాస్టాగ్ ఖాతా ద్వారా టోల్ మొత్తం ఆటోమేటిక్‌గా డెడక్ట్ అవుతుంది. దీంతో డ్రైవర్లు టోల్ బూత్ వద్ద ఆగడం, చెల్లింపుల కోసం వేచి ఉండడం, ట్రాఫిక్‌లో ఇరుక్కోవడం వంటి ఇబ్బందులు ఉండవు.

నిబంధనలు పాటించకపోతే ఈ-నోటీసులు
కొత్త విధానంలో నిబంధనలు పాటించని వాహనాలకు ఈ-నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. టోల్ చెల్లింపులో విఫలమైతే ఫాస్టాగ్ నిలిపివేత, జరిమానాలు లేదా ఇతర వాహన సంబంధిత చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గించడమే లక్ష్యం
భారతదేశం ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగాలంటే రవాణా ఖర్చులు తగ్గాల్సిన అవసరం ఉందని గడ్కరీ అన్నారు. దేశంలో ఎక్స్‌ప్రెస్‌వేలు, ఆర్థిక కారిడార్ల నిర్మాణంతో లాజిస్టిక్స్ ఖర్చులు 16 శాతం నుంచి 10 శాతానికి తగ్గినట్లు ఐఐటీ మద్రాస్, ఐఐటీ కాన్పూర్, ఐఐఎం బెంగళూరు నివేదికలు సూచిస్తున్నాయని తెలిపారు. అమెరికా, యూరప్ దేశాల్లో ఈ ఖర్చు సుమారు 12 శాతం ఉండగా, చైనాలో 8 నుంచి 10 శాతం మధ్య ఉందని పేర్కొన్నారు.

హరిత ఇంధనాలపై దృష్టి
ఇక, దేశం తన చమురు అవసరాల్లో 87 శాతం దిగుమతులపై ఆధారపడుతోందని గడ్కరీ తెలిపారు. ప్రతి సంవత్సరం భారీగా శిలాజ ఇంధనాల దిగుమతులతో పాటు కాలుష్యం కూడా పెరుగుతోందన్నారు. అందుకే ప్రత్యామ్నాయ ఇంధనాలు, బయో ఫ్యూయెల్స్, గ్రీన్ హైడ్రోజన్ వంటి పర్యావరణహిత ఇంధనాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. భారతదేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ లక్ష్యమని గడ్కరీ అన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించడంలో మెరుగైన రహదారులు, వేగవంతమైన రవాణా వ్యవస్థలు, తక్కువ లాజిస్టిక్స్ ఖర్చులు కీలక పాత్ర పోషిస్తాయని స్పష్టం చేశారు. కొత్త టోల్ విధానం అమల్లోకి వస్తే దేశవ్యాప్తంగా వాహనదారుల ప్రయాణ అనుభవం పూర్తిగా మారిపోవడం ఖాయం.