జనతాదళ్ (యునైటెడ్) బహిషృత నేత, రాజ్యసభ మాజీ ఎంపీ పవన్ వర్మ(68) తృణమూల్ కాంగ్రెస్లో చేరారు. మంగళవారం మమతా బెనర్జీ సమక్షంలో ఆయన టీఎంసీ పార్టీ జెండా కప్పుకున్నారు. మూడు రోజుల రాజధాని పర్యటనలో భాగంగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం ఢిల్లీ చేరుకున్నారు. పవర్ వర్మను పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పవన్ వర్మ రాకతో టీఎంసీ బలం పెరుగుతుందని, ఆయన అనుభవాలు పార్టీకి పనిచేస్తాయని మమతా పేర్కొన్నారు.
ఇలాంటి వ్యక్తులు పార్టీలో ఉండటం వల్ల పార్టీకి దిశా నిర్దేశం చేయ డంలో సాయపడతారని ఆమె పేర్కొన్నారు. గతంలో పవన్ వర్మ కేబినెట్ మంత్రి హోదాలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సలహాదారుగా పనిచేశారు. అలాగే పలు దేశాలకు భారత రాయ బారిగా, విదేశాంగ వ్యవహారాల శాఖ (ఎంఇఎ) ప్రతినిధిగాను విధులు నిర్వహించారు. పలు పుస్తకాలను రచించడంతో పాటు భూటాన్ అత్యున్నత పౌర పురస్కారమైన ‘డ్రక్ థక్సే’ని పొందారు. పార్టీ క్రమశిక్షణను పాటించడంలో విఫలమయ్యారని ఆరోపిస్తూ 2019లో పవన్ వర్మను నితీష్ కుమార్ జేడీయూ నుంచి బహిష్కరించారు.