ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) ఖాతాదారులకు కీలక ప్రకటన చేసింది. భారీ సిస్టమ్ అప్గ్రేడేషన్, డేటాబేస్ సమీకరణ పనుల నేపథ్యంలో ఆన్లైన్ క్లెయిమ్ ప్రాసెసింగ్ పోర్టల్ను మూడు రోజుల పాటు నిలిపివేయనున్నట్లు వెల్లడించింది. ఈ కారణంగా పీఎఫ్ ఉపసంహరణలు, ఖాతా బదిలీలు, ఇతర సభ్య సేవలు తాత్కాలికంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ఈపీఎఫ్వో సభ్యుల పోర్టల్లో విడుదల చేసిన నోటీసు ప్రకారం.. 2026 జూన్ 26 అర్ధరాత్రి (00:00 గంటల) నుంచి జూన్ 28 రాత్రి 11:59 గంటల వరకు క్లెయిమ్ల సమర్పణ, ప్రాసెసింగ్ సేవలు అందుబాటులో ఉండవు. సేవలు జూన్ 29 అర్ధరాత్రి నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి.
కారణమిదే?
క్లెయిమ్ల పరిష్కార ప్రక్రియను మరింత వేగవంతం చేయడం, భద్రతను పెంచడం, వినియోగదారులకు మెరుగైన అనుభవం అందించడం కోసం ఈ సిస్టమ్ మైగ్రేషన్ చేపడుతున్నట్లు EPFO తెలిపింది. భవిష్యత్తులో మరింత వేగంగా, విశ్వసనీయంగా, సురక్షితంగా సేవలు అందించేందుకు ఈ అప్గ్రేడ్ ఉపయోగపడుతుందని పేర్కొంది. ఈ కారణంగా ప్రాసెస్లో ఉన్న క్లెయిమ్ల పరిశీలన తాత్కాలికంగా నిలిచిపోతుంది. మైగ్రేషన్కు ముందు దాఖలు చేసిన క్లెయిమ్లను కూడా సేవలు పునరుద్ధరించిన తర్వాతే ప్రాసెస్ చేస్తారు. పీఎఫ్ ఉపసంహరణలు, ట్రాన్స్ఫర్ అభ్యర్థనలు, ఇతర ఆన్లైన్ సేవలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. లక్షలాది ఉద్యోగుల రిటైర్మెంట్ పొదుపులను నిర్వహిస్తున్న ఈపీఎఫ్వో గత కొన్నేళ్లుగా UAN ఆధారిత డిజిటల్ సేవలను విస్తృతంగా అందిస్తోంది. అందువల్ల ఈ సేవల తాత్కాలిక అంతరాయం సభ్యులపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
హెల్ప్లైన్
ఈ అప్గ్రేడ్ కారణంగా కలిగే అసౌకర్యానికి క్షమాపణలు తెలిపిన EPFO.. సభ్యులు సహనం పాటించాలని కోరింది. ఏవైనా సందేహాలు ఉంటే 14470 హెల్ప్లైన్ నంబర్ ద్వారా సంప్రదించాలని సూచించింది.
త్వరలో UPI, ATM ద్వారా..
ఇదిలా ఉండగా ఈపీఎఫ్వో త్వరలోనే సభ్యులకు UPI, ATM ద్వారా PF ఉపసంహరణ సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఈ కొత్త వ్యవస్థ అమల్లోకి వస్తే ఇప్పటివరకు ఉన్న క్లిష్టమైన ప్రక్రియకు బదులుగా సభ్యులు తమ బ్యాంకు ఖాతాలను నేరుగా లింక్ చేసుకుని, BHIM సహా ఇతర UPI ప్లాట్ఫారమ్ల ద్వారా సులభంగా డబ్బు ఉపసంహరించుకోగలరు. కొత్త విధానం అమల్లోకి వచ్చిన తర్వాత సభ్యులు తమ PF నిల్వలో 75 శాతం వరకు తక్షణమే ఉపసంహరించుకునే అవకాశం ఉంటుందని సమాచారం. దీంతో PF సేవలు మరింత సులభతరం కానున్నాయి.

