EPFO: ఖాతాదారులకు అలర్ట్.. మళ్లీ సేవలకు బ్రేక్.. కారణమిదే!

  • ఖాతాదారులకు మళ్లీ అలర్ట్
  • ఆన్‌లైన్ సేవల నిలిపివేత పొడిగింపు
  • జూలై 2 వరకు సేవలకు బ్రేక్
Epfo

Epfo

ఈపీఎఫ్‌వో సేవలకు మరోసారి బ్రేక్ పడింది. గత నెలలో అప్‌గ్రేడ్ కోసం కొన్ని రోజులు సేవలను నిలిపివేసింది. తాజాగా మరోసారి ఆన్‌లైన్ సేవలు నిలిపివేసినట్లు సంస్థ తెలిపింది. జూలై 2 వరకు ఆన్‌లైన్ సేవలు పని చేయవమని వెల్లడించింది.

ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) తన ఆన్‌లైన్ సేవల నిలిపివేత గడువును మరోసారి పొడిగించింది. భారీ స్థాయిలో డేటాబేస్ విలీనం, సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో సేవలను మరో మూడు రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ఈపీఎఫ్‌వో ప్రకటించింది. తాజా ప్రకటన ప్రకారం జూలై 2 అర్ధరాత్రి నుంచి సేవలు తిరిగి అందుబాటులోకి రానున్నాయి. ముందుగా ఈ నిర్వహణ పనులు జూన్ 28తో పూర్తవుతాయని.. జూన్ 29 నుంచి సేవలు పునరుద్ధరిస్తామని తెలిపింది. అయితే సాంకేతిక మార్పులు ఆశించిన దానికంటే ఎక్కువ సమయం తీసుకోవడంతో గడువును సవరించింది. ప్రస్తుతం జూన్ 26 అర్ధరాత్రి ప్రారంభమైన నిర్వహణ పనులు జూలై 1 రాత్రి 11:59 గంటల వరకు కొనసాగనున్నాయి.

నిర్వహణ పనుల కారణంగా ఈపీఎఫ్‌వో సభ్యులు, యజమానులు ఆన్‌లైన్ సేవలను వినియోగించలేరు. సభ్యులు పీఎఫ్ విత్‌డ్రాయల్ క్లెయిమ్ దాఖలు చేయడం, క్లెయిమ్ స్టేటస్ తెలుసుకోవడం, పాస్‌బుక్ చూడడం, వ్యక్తిగత వివరాలు సవరించడం, ఖాతా బదిలీ కోసం దరఖాస్తు చేయడం వంటి సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. అదే విధంగా యజమానులు కూడా యజమాని ఇంటర్‌ఫేస్‌లో లాగిన్ అయి ఉద్యోగుల పీఎఫ్‌కు సంబంధించిన కంప్లయన్స్ ఫైలింగ్‌లు, ఇతర పరిపాలనా పనులు పూర్తి చేయలేరు.

ఎందుకు ఈ అప్‌గ్రేడ్?

ఈ సాంకేతిక మార్పుల ప్రధాన ఉద్దేశం క్లెయిమ్ ప్రాసెసింగ్ వ్యవస్థను ఆధునీకరించడం అని ఈపీఎఫ్‌వో తెలిపింది. డేటాబేస్ విలీనం, సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ పూర్తయిన తర్వాత సేవలు మరింత వేగంగా… సురక్షితంగా.. సమర్థవంతంగా అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. దీంతో సభ్యులకు మెరుగైన డిజిటల్ అనుభవం లభిస్తుందని సంస్థ వెల్లడించింది. తాజా షెడ్యూల్ ప్రకారం జూలై 2 అర్ధరాత్రి 12 గంటల నుంచి ఆన్‌లైన్ సేవలు తిరిగి ప్రారంభం కానున్నాయి. సేవల నిలిపివేత వల్ల కలిగిన అసౌకర్యానికి ఈపీఎఫ్‌వో చింతిస్తున్నట్లు తెలిపింది. నిర్వహణ కాలంలో ఏవైనా సహాయం అవసరమైతే సభ్యులు 14470 హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించాలని సూచించింది.