బ్యాంకులను మోసంచేసి మనీలాండరింగ్కు పాల్పడ్డారన్న అభియోగంపై పీసీహెచ్ గ్రూప్ డైరెక్టర్ బల్వీందర్ సింగ్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. పీసీహెచ్ గ్రూప్ సంస్థల పేరిట.. బల్వీందర్ సింగ్ వివిధ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని సుమారు 370 కోట్ల రూపాయల మోసానికి పాల్పడ్డారని చెన్నై, బెంగళూరులో సీబీఐ గతంలో కేసులు నమోదు చేసింది.
ఈ నేపథ్యంలో తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పీసీహెచ్ గ్రూపునకు చెందిన రూ.6.18కోట్ల ఆస్తులు అటాచ్ చేసింది. హైదరాబాద్, బెంగళూరులో 11 ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. పీసీహెచ్ గ్రూప్ డైరెక్టర్ బల్వీందర్ సింగ్ బినామీ పేరిట ఉన్న ఆస్తులను ఈడీ అటాచ్ చేసినట్లు తెలిపింది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను డొల్ల కంపెనీల ద్వారా తమ వ్యక్తిగత, సంస్థల ఖాతాలకు మళ్లించుకున్నట్లు తేలిందని ఈడీ ఇప్పటికే వెల్లడించింది.
