Driving License: దేశవ్యాప్తంగా కోట్లాది మంది వాహనదారులకు భారీ ఉపశమనం కలిగించేలా కేంద్ర రవాణా, రహదారి మంత్రిత్వ శాఖ ఒక సంచలన నిర్ణయం వైపు అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ (DL) కాలపరిమితిని ఏకంగా 50 ఏళ్లకు పెంచే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోంది. అదే గనుక జరిగితే, జనాలకు లైసెన్స్ రెన్యూవల్ కోసం పదే పదే ఆర్టీవో (RTO) ఆఫీసుల చుట్టూ తిరిగే తిప్పలు తప్పుతాయని అంటున్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. ఎవరైనా కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటే అది గరిష్టంగా 20 ఏళ్ల వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఆ తర్వాత గడువు ముగియగానే మెడికల్ సర్టిఫికెట్, ఇతర అవసరమైన పత్రాలను సమర్పించి మళ్లీ రెన్యూవల్ చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే డిజిటలైజేషన్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ కాలపరిమితిని 50 ఏళ్లకు పెంచాలని కేంద్ర రవాణా శాఖ భావిస్తోందట. దీనివల్ల పౌరులపై అదనపు భారం తగ్గడంతో పాటు పారదర్శకత పెరుగుతుందని భావిస్తున్నారు.
ట్విస్ట్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వాలు..
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈ సరికొత్త ప్రతిపాదనపై కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. డ్రైవింగ్ లైసెన్స్ వాలిడిటీని ఒకేసారి 50 ఏళ్లకు పెంచితే, రెన్యూవల్ ఫీజుల రూపంలో రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే ఆదాయం భారీగా తగ్గిపోతుందని కొన్ని రాష్ట్రాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ ఆదాయ లోటును ఎలా పూడ్చాలనే అంశంపై ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర రవాణా శాఖల మధ్య చర్చలు నడుస్తున్నాయని సమాచారం. కేవలం డ్రైవింగ్ లైసెన్స్ మాత్రమే కాకుండా, వాహనదారులకు మరింత సులభంగా సేవలు అందించేందుకు రహదారి మంత్రిత్వ శాఖ మరికొన్ని కీలక మార్పులను కూడా సిద్ధం చేస్తోందని చెబుతున్నారు. ఇకపై వాహన యాజమాన్య హక్కుల (Vehicle Ownership) బదిలీ ప్రక్రియను కూడా పూర్తిగా ఆన్లైన్ చేయనున్నారు. కమర్షియల్ వాహనాల పర్మిట్ రెన్యూవల్ ప్రక్రియను కూడా డిజిటలైజ్ చేయాలని చూస్తున్నారట. దీనివల్ల పేపర్ వర్క్ పూర్తిగా తగ్గడమే కాకుండా, చిన్న చిన్న పనుల కోసం పౌరులు ఆర్టీవో కార్యాలయాలకు తరచూ వెళ్లాల్సిన అవసరం తప్పుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదనలన్నీ పరిశీలన దశలోనే ఉన్నాయి. దీనిపై ఉన్నత స్థాయి చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని, త్వరలోనే అన్ని రాష్ట్రాల రవాణా మంత్రులతో సమావేశం నిర్వహించి దీనిపై ఒక తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని రవాణా శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు.

