Rajnath Singh: భారత్‌కు ఇక క్షిపణుల కొరత ఉండదు.. కేంద్రం సంచలన నిర్ణయం..

  • డీఆర్డీఓ టెక్నాలజీ దేశీయ పరిశ్రమలకు బదిలీ..
  • ఆమోదం తెలిపిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్..
  • ప్రైవేట్ సంస్థలు రావడంతో పెరగనున్న క్షిపణుల తయారీ..
  • విదేశీ ద్రవ్యం ఆదాతో పాటు ఎగుమతి పెరిగే అవకాశం..
Rajnath Singh

Rajnath Singh

Rajnath Singh: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) అభివృద్ధి చేసిన అన్ని సంప్రదాయ క్షిపణి వ్యవస్థల సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశీయ పరిశ్రమకు బదిలీ చేయడానికి ఆయన ఆమోదం తెలిపారు. ఈ టెక్నాలజీ బదలాయింపుతో దేశంలోనే క్షిపణుల ఉత్పత్తికి మార్గం సుగమమైంది. గతంలో ప్రభుత్వం రంగ సంస్థల వద్ద ఉన్న ఈ టెక్నాలజీని ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడం ద్వారా క్షిపణుల ఉత్పత్తి మరింత పెరగనుంది. ఇదే సమయంలో కంపెనీల అర్హత, ధ్రువీకరణ, నియంత్రణ అసవరాలను బట్టి, కంపెనీలు అన్ని ప్రమాణాలు పాటించిన తర్వాతే ఈ టెక్నాలజీ షేరింగ్ ఉంటుంది.

దేశంలోనే అధునాతన క్షిపణుల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం, విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం ఈ నిర్ణయం ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. అత్యవసర పరిస్థితుల్లో ఆయుధాల సరఫరాకు అంతరాయం కలగకుండా దేశీయ ఉత్పత్తి సామర్థ్యం కీలకంగా మారనుంది. కేంద్రం నిర్ణయం వల్ల రక్షణ తయారీ వ్యవస్థ మరింత విస్తరిస్తుంది. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, ఇతర సాంకేతిక భాగస్వాములు కూడా క్షిపణుల సప్లై చైన్‌లో భాగస్వామం అయ్యే అవకాశం ఉంది.

ఇదే కాకుండా, అధునాతన రక్షణ వ్యవస్థల కోసం భారత్ విదేశీ సరఫరాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఇప్పుడు డీఆర్డీవో సాంకేతికను అందించడం ద్వారా ఈ ఆధారపడటాన్ని క్రమంగా తగ్గించాలని కేంద్రం భావిస్తోంది. దేశంలో క్షిపణి వ్యవస్థల్ని తయారు చేయడం వల్ల విదేశీ మారకద్రవ్యం ఆదా చేయడంతో పాటు అవసరమైన సమయంలో ఆయుధాల లభ్యతను వేగంగా పెంచే అవకాశం ఉంది. ప్రైవేట్ భాగస్వామ్యం పెరగడం వల్ల రక్షణ తయారీ రంగంలో పోటీ, సాంకేతిక ఆవిష్కరణలు కూడా సాధ్యం అవుతాయి. అంతర్జాతీయ ఎగుమతి చేసే సామర్థ్యం పెరుగుతుంది.