RudraM-2: భారత అమ్ములపొదిలో మరో అస్త్రం చేరింది. యాంటీ-రేడియేషన్ మిస్సైల్ ‘‘రుద్రమ్-2’’ను విజయవంతంగా పరీక్షించారు. డీఆర్డీవో, భారత వైమానిక దళం సంయుక్తంగా దేశంలోనే అత్యంత అధునాతనమైన గగనతలం నుంచి భూమిపైకి ప్రయోగించే ఈ క్షిపణిని రూపొందించింది. ఒడిశాలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్లో ఈ పరీక్షను నిర్వహించారు. Su-30 MKI యుద్ధ విమానం నుండి ఈ క్షిపణిని ప్రయోగించారు. క్షిపని నిర్దేశించిన లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించినట్లు రక్షణ మంత్రిత్వ శఆఖ వెల్లడించింది. అన్ని పరికరాల పనితీరు సరిగా ఉన్నట్లు నిర్ధారించారు. రుద్రమ్ 2 విజయవంతం కావడం భారతదేశ దాడి సామర్థ్యాన్ని మరింత పెంచింది. శత్రుదేశాల రాడార్లు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ను దెబ్బతీయడం ఈ క్షిపణి ప్రత్యేకత. ప్రస్తుతం భారత వాయుసేన వినియోగిస్తున్న రష్యా తయారీ Kh-31 యాంటీ-రేడియేషన్ క్షిపణుల రుద్రమ్ 2 ప్రత్యామ్నాయంగా మారనుంది.
యాంటీ రేడియేషన్ మిస్సైల్ అంటే ఏమిటి..?
సాధారణ క్షిపణి, యాంటి-రేడియేషన్ క్షిపణి మధ్య తేడా అవి దాడి చేసే పద్ధతులే. యాంటీ రేడియేషన్ మిస్సైల్ శత్ర దేశాల రాడార్ వ్యవస్థలు, కమ్యూనికేషన్ నెట్వర్క్లు, జామర్లు, రేడియో ఫ్రీక్వెన్సీలు విడుదల చేసే లక్ష్యాలను గుర్తించి, నాశనం చేస్తుంది,. యుద్ధం ప్రారంభమైతే శత్రదేశాలు తమ గగతనలంలోకి వచ్చే యుద్ధ విమానాలు, క్షిపణుల్ని గుర్తించడానికి రాడార్ వ్యవస్థల్ని యాక్టివేట్ చేస్తాయి. రుద్రమ్ వంటి క్షిపణులు ఈ రాడార్ల నుంచి వెలువడే సంకేతాలను, రేడియేషన్ గుర్తించి వాటిని టార్గెట్ చేసి ధ్వంసం చేస్తాయి. ఒక వేళ క్షిపణికి భయపడి శత్రుదేశాలు వాటి రాడార్ వ్యవస్థల్ని నిలిపేసినప్పటికీ, వాటి లోకేషన్ గుర్తుంచుకుని దాడి చేయడం రుద్రమ్ ప్రత్యేకత.
ఇప్పటికే భారత్ రుద్రమ్-1ను విజయవంతంగా పరీక్షించింది. రుద్రమ్ 1 పరిధి 100 నుంచి 200 కిలోమీటర్లు. రుద్రమ్ -2 మొదటిదాని కన్నా శక్తివంతమైనది. ఎక్కువ దూరం ప్రయాణించి దాడి చేయగలదు. దీని పరిధి 300 నుంచి 350 కి.మీ. ఇది భారత సరిహద్దుల నుంచే శత్రుదేశాలపై దాడులు చేయగలదు. ఈ క్షిపణి సాలిడ్ ఫ్యూయల్తో నడుస్తుంది. ఈ క్షిపణి ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్, GPS, అధునాతన పాసివ్ హోమింగ్ హెడ్లతో కూడిన హైబ్రిడ్ నావిగేషన్ వ్యవస్థను ఉపయోగిస్తుంది. శబ్ధవేగాని కన్నా 5.5 రెట్ల( మాక్ 5.5) వేగంతో దాడి చేసే సత్తా రుద్రమ్ 2 సొంతం.
