తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పుణ్యమా? అంటూ కాంగ్రెస్తో సుదీర్ఘ కాలం కొనసాగిన బంధాన్ని డీఎంకే తెంచుకుంది. ఇండియా కూటమి నుంచి బయటకొచ్చినట్లు డీఎంకే అధికారికంగా ప్రకటించింది. అంతేకాకుండా దిగువ సభలో సీటింగ్ అమరికను కూడా మార్చాలని కోరుతూ డీఎంకే ఎంపీ కనిమొళి లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. ‘‘మారుతున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్తో మా పొత్తు ముగిసినందున.. సభలో మా సభ్యులు వారితో పాటు ప్రస్తుత ఆసన పద్ధతిలో కొనసాగడం సముచితం కాకపోవచ్చు.’’ అని లేఖలో డీఎంకే పేర్కొంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. విజయ్ నేతృత్వంలోని టీవీకే మాత్రమే 108 స్థానాలతో అతి పెద్ద పార్టీగా అవతరించింది. అయితే విజయ్ ఆహ్వానం మేరకు వెంటనే కాంగ్రెస్కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు టీవీకేకు మద్దతు తెలిపారు. అయితే ఈ సమయంలో డీఎంకేతో చర్చించకుండానే ఏకపక్షంగా టీవీకేకు మద్దతు తెల్పడంపై అసహనం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్తో ఉన్న బంధాన్ని డీఎంకే తెంచుకుంది. ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చినట్లు తెలిపింది. దీంతో తమిళనాడులో వేగంగా రాజకీయ సమీకరణాలు మారిపోయాయి.
