NTV Telugu Site icon

India-China Border: లద్దాఖ్‌లో భారత్‌, చైనా బలగాల ఉపసంహరణ..

Ind China

Ind China

India-China Border: భారత్‌- చైనా దేశాల మధ్య వాస్తవాధీన రేఖ వెంబడి గత నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలికేందుకు ఇటీవల ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందం జరిగింది. అందుకు అనుగుణంగానే సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణ ప్రక్రియ తాజాగా ప్రారంభమైంది. తూర్పు లద్దాఖ్‌ సెక్టార్‌లోని రెండు కీలక ప్రాంతాలైన డెమ్చోక్‌, డెస్పాంగ్‌ నుంచి రెండు దేశాల బలగాలు వెనక్కి వెళ్లినట్లు భారత రక్షణ శాఖ అధికారులు ఈరోజు (శుక్రవారం) తెలిపారు.

Read Also: Minister Narayana: దాచేప‌ల్లిలో డ‌యేరియాపై మంత్రి నారాయణ సమీక్ష..

ఇక, ఒప్పందం ప్రకారం.. ఈ ప్రాంతంలోని సైనిక సామగ్రి, ఇతర పరికరాలను భారత బలగాలు వెనక్కి తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక్కడి టెంట్లు, తాత్కాలిక నిర్మాణాలను కూడా ఇరు దేశాల బలగాలు తొలగిస్తున్నట్లు భారత రక్షణ శాఖ అధికారులు చెప్పుకొచ్చారు. చార్దింగ్‌ లా పాస్‌కు సమీపంలోని నదికి పశ్చిమదిశగా భారత బలగాలు, తూర్పు దిశగా చైనా బలగాలు వెనక్కివెళ్తున్నట్లు తెలిపాయి. ఈప్రాంతాల్లో సరిహద్దులకు ఇరు వైపులా దాదాపు 10-12 తాత్కాలిక నిర్మాణాలు, 12 టెంట్లు నిర్మించినట్లు సమాచారం. బలగాల ఉపసంహరణ ప్రక్రియంతా పూర్తైన తర్వాత మరో 4-5 రోజుల్లో డెస్పాంగ్‌, డెమ్చోక్‌ ప్రాంతాల్లో పెట్రోలింగ్‌ను పునరుద్ధరించబోతున్నట్లు వెల్లడించారు.

Read Also: BJP Maha Dharna: నేడు ఇందిరా పార్క్ వేదికగా బీజేపీ మహా ధర్నా.. పాల్గొననున్న కిషన్ రెడ్డి, బండి సంజయ్..

కాగా, వాస్తవాధీన రేఖ వెంబడి గస్తీ పునఃప్రారంభంపై ఇరు దేశాలు ఒప్పందం చేసుకున్నాయి. దీని ప్రకారం.. ఎల్‌ఏసీ వెంబడి 2020 గల్వాన్‌ ఘర్షణలకు ముందు నాటి యథాస్థితి కొనసాగనున్నాయి. భారత్- చైనా దేశాల సైనికులు 2020లో గస్తీ నిర్వహించిన పెట్రోలింగ్‌ పాయింట్లకు ఇప్పుడు స్వేచ్ఛగా వెళ్లొచ్చు. ఇటీవల జరిగిన బ్రిక్స్‌ సమ్మిట్ లో ఇరు దేశాల నేతలు ప్రధాని మోడీ, జిన్ పింగ్ ఈ ఒప్పందాన్ని ధ్రువీకరించారు.