NTV Telugu Site icon

Puja khedkar: యూపీఎస్సీ చర్యపై ఢిల్లీ హైకోర్టులో విచారణ.. రద్దు ఉత్తర్వులు అందలేదన్న పూజా

Iaspujakhedkar

Iaspujakhedkar

వివాదాస్పద మాజీ ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్.. యూపీఎస్సీ చర్యను సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్‌పై బుధవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఐఏఎస్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తూ యూపీఎస్సీ తీసుకున్న చర్యలకు సంబంధించిన ఉత్తర్వులు తనకు అందలేదని విచారణ సందర్భంగా పూజా ఖేద్కర్ న్యాయస్థానానికి తెలిపింది. తన అభ్యర్థిత్వాన్ని రద్దు చేసినట్లుగా కేవలం తాను మీడియాతో ద్వారా తెలుసుకున్నట్లు ఆమె పేర్కొంది. ఐఏఎస్ అభ్యర్థిత్వం రద్దుతో పటు భవిష్యత్‌లో జరిగే అన్ని పరీక్షల నుంచి యూపీఎస్సీ డిబార్ చేసనట్లుగా మీడియాలో కథనాలు చూసినట్లు ఆమె ధర్మాసనానికి తెలిపింది. పూజా ఖేద్కర్ పిటిషన్‌ను న్యాయమూర్తి జ్యోతి సింగ్ విచారించారు.

అయితే పూజా ఖేద్కర్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేసినట్లుగా అధికారిక ఉత్తర్వుపై రెండు రోజుల్లో కమ్యూనికేట్ చేస్తామని యూపీఎస్సీ న్యాయస్థానానికి స్పష్టం చేసింది. యూపీఎస్సీ తరపున న్యాయవాది నరేష్ కౌశిక్ పేర్కొన్నారు. ఖేద్కర్ అందుబాటులో లేనందున పత్రికా ప్రకటన ద్వారా తెలియజేయడం జరిగిందని తెలిపారు.
షోకాజ్ నోటీసు జారీ చేసినా.. ఆమె స్పందించకపోవడంతో యూపీఎస్సీ చర్యలు తీసుకుందని తెలిపారు.

2023 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన పూజా ఖేద్కర్.. అక్రమంగా యూపీఎస్సీ ఉద్యోగాన్ని సంపాదించినట్లుగా ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆమెకు యూపీఎస్సీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. జూలై 30 వరకు అవకాశం ఇచ్చినా స్పందన రాకపోవడంతో.. జూలై 31న ఆమె అభ్యర్థిత్వాన్ని.. భవిష్యత్‌లో జరిగే అన్ని రకాల పరీక్షల నుంచి డిబార్ చేసినట్లుగా యూపీఎస్సీ పేర్కొంది. ఇక ఆమెపై ఢిల్లీ పోలీసులు క్రిమినల్ కేసు బుక్ చేశారు. దీనిపై ఢిల్లీ కోర్టులో ముందుస్తు బెయిల్ పిటిషన్ వేయగా.. న్యాయస్థానం తిరస్కరించింది. ఇదిలా ఉంటే పూజా దుబాయ్ పారిపోయినట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.