Site icon NTV Telugu

Deve Gowda: కాంగ్రెస్‌తో అందుకే విడాకులు.. ఖర్గే పంచ్‌లపై దేవెగౌడ కౌంటర్

Devegowda

Devegowda

పెద్దల సభలో బుధవారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వచ్చే నెలలో కొందరు రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాజ్యసభలో వీడ్కోలు చర్చ చేపట్టారు. ఈ సందర్భంగా రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతూ.. మాజీ ప్రధాని దేవెగౌడపై పంచ్‌లు వేశారు. ‘‘ప్రేమ-పెళ్లి’’ పదాలు ఉపయోగించారు. కాంగ్రెస్‌తో డేటింగ్ చేసి.. బీజేపీని పెళ్లిని చేసుకున్నారని ఛలోక్తులు విసిరారు. దీంతో ప్రధాని మోడీ సభ సభ్యులంతా నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది.

తాజాగా ఖర్గే హాస్యాస్పదంపై దేవెగౌడ కౌంటర్ ఎటాక్ చేశారు. కాంగ్రెస్సే తనను బలవంతంగా పెళ్లి చేసుకునేలా చేసిందని.. ఆ బంధం ఊపిరాడకుండా చేయడంతో విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని మాజీ ప్రధాని కూడా సరదాగా బదులిచ్చారు. 2018లో కాంగ్రెస్, జనతా దళ్ సెక్యులర్ మధ్య జరిగిన రాజకీయ పొత్తును గుర్తుచేసుకుంటూ.. 2019లో తాను కాంగ్రెస్‌తో సంబంధాలు తెంచుకోలేదని.. పైగా కాంగ్రెస్సే తనను వదిలేసిందన్నారు. ఆ సంబంధం కేవలం దూషణలతో నిండి ఉందని.. అందుకే తాను విడాకులు కోరాల్సి వచ్చిందని తెలిపారు. ఇక మిత్రుడు ఖర్గే సభలో మాట్లాడినప్పుడు తాను సభలో లేనని చెప్పారు. రేపటి ఉగాది వేడుకల్లో పాల్గొనేందుకు బెంగళూరుకు రావాల్సి వచ్చిందని.. అందుకే సభలో లేనన్నారు.

‘‘2018లో కాంగ్రెస్ పార్టీ గులాం నబీ ఆజాద్‌ను పంపి.. కుమారస్వామికి ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేసిన విషయం ఖర్గేకే గుర్తుంటుంది. నేను దీనిని సమర్థించలేదు. ఖర్గేనే ముఖ్యమంత్రిని చేయాలని నేను బహిరంగంగా చెప్పాను. ఆ సమయంలో సిద్దరామయ్య కూడా అక్కడే ఉన్నారు. అయినప్పటికీ ఆజాద్… కుమారస్వామి నాయకత్వానికే పట్టుబట్టారు. ‘పెళ్లి’ లాంటివన్నీ అయ్యాక 2019లో వాళ్లు ఏం చేశారు? మమ్మల్ని వదిలేశారు. ఎంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి ఫిరాయించారో.. వారిని ఎవరు పంపారో ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే. ఫిరాయింపులను ప్రేరేపించిన వ్యక్తిపై కాంగ్రెస్ చర్య తీసుకుని ఉంటే.. ఈ రోజు నా స్నేహితుడు ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడిగా మరింత మెరుగైన స్థితిలో ఉండేవారు. అసలు విషయాన్ని స్పష్టం చేయాలనుకుంటున్నాను. నేను కాంగ్రెస్ కూటమిని వీడలేదు. పైగా వారే మమ్మల్ని వదిలి వెళ్లిపోయారు. వారితో విడిపోయి.. మరింత అనువైన భాగస్వామిని వెతుక్కోమని వాళ్లే నన్ను బలవంతం చేశారు.’’ అని దేవెగౌడ ఎక్స్‌లో పేర్కొన్నారు.

ఖర్గే ఏమన్నారంటే..
రాజ్యసభ సభ్యుల వీడ్కోలు ప్రసంగంలో మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతూ.. మాజీ ప్రధాని దేవెగౌడపై పరోక్ష విమర్శలు గుప్పించారు. దేవెగౌడ తనకు 54 ఏళ్లుగా తెలుసని.. చాలా కాలం సన్నిహితంగా పని చేసినట్లుగా గుర్తుచేశారు. అయితే ఇంతలో ఏమైందో.. ఏమో తెలియదు గానీ మాతో ఉంటుండగానే అధికార పార్టీతో చేతులు కలిపారన్నారు. ఈ సందర్భంగా ‘‘ప్రేమ-పెళ్లి’’ పదాలు ఉపయోగించారు. మాతో డేటింగ్ చేసి.. చివరికి వారిని పెళ్లిని చేసుకున్నారని పంచ్ వేశారు. ఈ డైలాగ్‌తో ప్రధాని మోడీ సహా సహచర ఎంపీలంతా నవ్వుకున్నారు.

దేవెగౌడ..

దేవెగౌడ 1996 జూన్ 1 నుంచి 1997 ఏప్రిల్ 21 వరకు భారతదేశ ప్రధానమంత్రిగా పనిచేశారు. ఆయన పదవీకాలం సుమారు 10–11 నెలలు కొనసాగింది. భారతదేశానికి 11వ ప్రధానమంత్రిగా ఉన్నారు. కాంగ్రెస్ నుంచి బయటి మద్దతు పొందిన యునైటెడ్ ఫ్రంట్ సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించారు.

 

Exit mobile version