దేశ రాజకీయాల్లో మరోసారి డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) అంశం చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ బిల్లును మళ్లీ పార్లమెంట్ ముందుకు తీసుకురావాలని యోచిస్తున్నట్లు సమాచారం. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో ఏర్పడిన అంతర్గత సంక్షోభం, తమిళనాడులో డీఎంకే-కాంగ్రెస్ పొత్తు విరగడం వంటి తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ అంశం మళ్లీ వేగం అందుకున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
అధికార వర్గాల సమాచారం ప్రకారం.. 2029 లోక్సభ ఎన్నికలకు ముందే డీలిమిటేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బీజేపీ నాయకత్వం టీఎంసీ, డీఎంకే సహా పలు ప్రాంతీయ పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. జనాభా మార్పుల ఆధారంగా లోక్సభ స్థానాల పునర్విభజన జరిగితే తమ రాష్ట్రాలకు నష్టం కలుగుతుందనే ఆందోళనలను నివారించడంతో పాటు విస్తృత రాజకీయ ఏకాభిప్రాయం సాధించడమే ఈ ప్రయత్నాల ఉద్దేశంగా చెబుతున్నారు.
టీఎంసీలో అంతర్గత సంక్షోభం
పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీలో విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. పార్టీకి చెందిన 58 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి రితబ్రతా బెనర్జీని శాసనసభ పక్ష నేతగా ఎన్నుకుని స్పీకర్ గుర్తింపు కూడా పొందారు. 28 ఏళ్ల చరిత్ర కలిగిన టీఎంసీలో ఇది తొలి అధికారిక చీలికగా భావిస్తున్నారు.
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరాజయం అనంతరం టీఎంసీలో అసంతృప్తి పెరిగినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ చేతుల్లో అధికారం కేంద్రీకృతమవుతోందనే భావన కొందరు ఎమ్మెల్యేల్లో పెరిగిందని సమాచారం. ఇప్పుడు ఎమ్మెల్యేల తర్వాత ఎంపీల్లో కూడా విభేదాలు చెలరేగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
డీఎంకే-కాంగ్రెస్ మధ్య విభేదాలు
తమిళనాడులో చాలా కాలంగా కలిసి సాగిన డీఎంకే-కాంగ్రెస్ సంబంధాలు కూడా ఇటీవల దెబ్బతిన్నాయి. ముఖ్యమంత్రి పదవికి టీవీకే అధినేత విజయ్కు కాంగ్రెస్ మద్దతు ప్రకటించడంతో డీఎంకే ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ పార్టీ డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ నుంచి వైదొలగి విజయ్కు మద్దతు ఇవ్వడంతో ఇరు పార్టీల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. ఈ నేపథ్యంలో డీఎంకే శాసనసభ్యుల సమావేశంలో కాంగ్రెస్పై విమర్శలు చేస్తూ తీర్మానం ఆమోదించారు. అంతేకాకుండా డీఎంకే ఎంపీ కనిమొళి లోక్సభలో కాంగ్రెస్ సభ్యుల నుంచి తమ పార్టీ ఎంపీలకు ప్రత్యేక సీటింగ్ ఏర్పాటు చేయాలని స్పీకర్కు లేఖ రాశారు. ఇక జూన్ 8న జరగనున్న ఇండియా కూటమి సమావేశానికి కూడా డీఎంకే దూరమైంది.
గతంలో విఫలమైన రాజ్యాంగ సవరణ బిల్లు
లోక్సభ స్థానాల సంఖ్యను పెంచడం, మహిళా రిజర్వేషన్ అమలుకు అవసరమైన రాజ్యాంగ సవరణ బిల్లు ఈ ఏడాది ఏప్రిల్ 18న లోక్సభలో ఓటింగ్కు వెళ్లి విఫలమైంది. బిల్లుకు అనుకూలంగా 298 మంది సభ్యులు ఓటు వేయగా.. 230 మంది వ్యతిరేకించారు. అయితే రాజ్యాంగ సవరణకు అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ (352 ఓట్లు) రాకపోవడంతో బిల్లు ఆమోదం పొందలేదు. ఆ బిల్లు ప్రకారం 2011 జనగణన ఆధారంగా డీలిమిటేషన్ నిర్వహించి 2029 ఎన్నికల నాటికి లోక్సభ స్థానాల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 543 నుంచి గరిష్ఠంగా 850కు పెంచే ప్రతిపాదన ఉంది. అలాగే రాష్ట్ర అసెంబ్లీలు, కేంద్ర పాలిత ప్రాంతాల శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేయడానికి సీట్ల సంఖ్యను పెంచాలని ప్రతిపాదించారు. అయితే బిల్లు విఫలమైన అనంతరం కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ బిల్లు, యూనియన్ టెరిటరీస్ లాస్ (సవరణ) బిల్లులను వెనక్కి తీసుకుంది.
2029 ఎన్నికల దిశగా కసరత్తు
ప్రస్తుతం వివిధ రాజకీయ పార్టీలతో చర్చలు కొనసాగుతున్నాయని, సంప్రదింపులు పూర్తయిన తర్వాత సాధ్యమైనంత విస్తృత ఏకాభిప్రాయం సాధించి డీలిమిటేషన్ బిల్లును మళ్లీ పార్లమెంట్ ముందుకు తీసుకురావచ్చని ప్రభుత్వ వర్గాలు సూచిస్తున్నాయి. 2029 సాధారణ ఎన్నికలకు ముందే ఈ ప్రక్రియ పూర్తి చేయాలనే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
