Delhi: దేశ రాజధాని ఢిల్లీతో పాటు దాని పరిసర ప్రాంతాల్లో (NCR) వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సోమవారం మధ్యాహ్నం ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, ఫరిదాబాద్లలో భారీ ఇసుక తుఫాన్ (Dust Storm) విరుచుకుపడింది. పాలం ప్రాంతంలో గంటకు ఏకంగా 92 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈ ధూళి గాలుల కారణంగా రోడ్లపై చీకట్లు కమ్ముకున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకే అర్ధరాత్రిని తలపించేలా దట్టమైన దుమ్ము, ధూళి వ్యాపించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విజిబిలిటీ (కనిపించే దూరం) పూర్తిగా పడిపోవడంతో హెడ్లైట్లు ఆన్ చేసుకుని వాహనాలు నడపాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఢిల్లీకి ‘రెడ్ అలర్ట్’.. రంగంలోకి ఐఎండీ
రాజధానిలో నెలకొన్న ప్రమాదకర పరిస్థితులను దృష్ట్యా భారత వాతావరణ శాఖ (IMD) ‘రెడ్ అలర్ట్’ జారీ చేసింది. రానున్న కొన్ని గంటల్లో వాతావరణం మరింత క్షీణించే అవకాశం ఉందని హెచ్చరించింది. పిడుగులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఎన్సీఆర్ పరిధిలోని కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలంతా ఇళ్లల్లోనే ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు పిలుపునిచ్చారు. హర్యానాలోని రోహ్తక్ మీదుగా ఏర్పడిన ఒక శక్తివంతమైన మేఘాలు ఆగ్నేయ దిశగా ఢిల్లీ వైపు వేగంగా దూసుకొస్తోందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఇప్పటికే ఢిల్లీ వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై, పలుచోట్ల చినుకులు పడుతున్నాయి. రానున్న గంటల్లో గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని, కొన్నిసార్లు ఇవి 80 కిలోమీటర్ల వేగాన్ని కూడా అందుకోవచ్చని ఐఎండీ హెచ్చరించింది.
ఏయే ప్రాంతాల్లో అలర్ట్ ప్రకటించారంటే..
రానున్న కొన్ని గంటల్లో ఢిల్లీ పరిధిలోని బవానా, రాజౌరీ గార్డెన్, పటేల్ నగర్, సఫ్దర్జంగ్, లోధి రోడ్, బుద్ధ జయంతి పార్క్, రాష్ట్రపతి భవన్, రాజీవ్ చౌక్, ఐటీఓ (ITO), కల్కాజీ, తుగ్లకాబాద్ ప్రాంతాల్లో, అలాగే హర్యానా పరిధిలో రోహ్తక్, ఖర్ఖోదా, పల్వాల్ పరిసర ప్రాంతాల్లో భారీ తుఫాన్ గాలి, వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ అకస్మాత్తు వాతావరణ మార్పులతో ఢిల్లీలో ఎండల తీవ్రత తగ్గి, ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి.
#WATCH | Delhi witnesses a weather change as a dust storm sweeps across the Dwarka Sector 12 Metro station area. pic.twitter.com/5JyMlBsk6J
— ANI (@ANI) June 15, 2026

