NTV Telugu Site icon

Uttar Pradesh: వలస కూలీల సైకిళ్ల వేలం.. ప్రభుత్వానికి రూ.21 లక్షల ఆదాయం

Cycles Min

Cycles Min

2020 లాక్‌డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా చాలా మంది కూలీలు తమ స్వస్థలాలకు తరలివెళ్లిపోయారు. ఆ సమయంలో సరైన రవాణా సౌకర్యాలు కూడా లేవు. దీంతో వలస కూలీలు కాలి నడకన లేదా సైకిళ్ల మీద సొంతూళ్లకు వెళ్లారు. యూపీలో కొందరు వలస కూలీలు తమ సైకిళ్లను సహరణ్ పూర్‌లో వదిలి వెళ్లారు. ఎందుకంటే సహరణ్‌ పూర్ జిల్లా కేంద్రం అనేక రాష్ట్రాలకు మెయిన్ సెంటర్‌గా ఉంటుంది. దీంతో ఆ ప్రాంతంలో కూలీలు భారీ ఎత్తున సైకిళ్లు వదిలివెళ్లారు. ఇన్నాళ్లు ఆయా సైకిళ్లు ఎండకు ఎండి.. వానకు తడిచి పాడవుతున్నాయి. దీంతో ప్రభుత్వం స్పందించింది.

Corona: ‘కార్బెవాక్స్’ బూస్టర్ డోస్ కు అనుమతి

ఈ నేపథ్యంలో రెండేళ్ల క్రితం లాక్‌డౌన్ విధించిన సమయంలో కూలీలు వదిలి వెళ్ళిన సైకిళ్లను యూపీ ప్రభుత్వం తాజాగా వేలం వేసింది. మొత్తం 5,400 సైకిళ్లను వేలం వేయగా రూ.21 లక్షల ఆదాయం వచ్చింది. సహరణ్ పూర్‌ జిల్లా కేంద్రం అనేక రాష్ట్రాలకు వెళ్లేందుకు మెయిన్ సెంటర్‌గా ఉంది. ఇక్కడి నుంచి హర్యానా, పంజాబ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు వెళ్లొచ్చు. సైకిళ్ల ద్వారా సహరణ్‌పూర్ చేరుకున్న కూలీలను అధికారులు బస్సులు, ఇతర రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసి సొంతూళ్లకు తరలించారు. సైకిళ్లు విడిచి వెళ్లే వాళ్లకు టోకెన్లు కూడా ఇచ్చారు. దాదాపు 14,600 మంది తమ సైకిళ్లను అక్కడే వదిలేసి వెళ్లారు. కొంత కాలం తర్వాత చాలా మంది తిరిగొచ్చి టోకెన్లు చూపించి తమ సైకిళ్లు తీసుకెళ్లారు. రెండేళ్లు గడుస్తున్నా ఇంకొందరు సైకిళ్లను తీసుకెళ్లలేదు. దీంతో సుమారు 5,400 సైకిళ్లు అలాగే ఉండిపోయాయి. తాజాగా ఈ సైకిళ్లను యూపీ ప్రభుత్వం వేలం వేసింది.