UP: వచ్చే ఏడాది ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈలోపే కాంగ్రెస్ పార్టీ పొత్తులకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా, దళిత నాయకురాలిగా ఉన్న బహుజన్ సమాజ్వాదీ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతితో పొత్తుకు కాంగ్రెస్ పార్టీ ఆరాటపడుతున్నట్లు కనిపిస్తోంది. మంగళవారం రోజు ఇద్దరు కాంగ్రెస్ నాయకులు ఎలాంటి అపాయింట్మెంట్ లేకుండా లక్నోని మాయావతి ఇంటికి వెళ్లారు. అయితే, ముందస్తు అనుమతి లేకపోవడంతో ఆమె భద్రతా సిబ్బంది వారిని వెనక్కి పంపింది.
కాంగ్రెస్ నేతలు రాజేంద్ర పాల్ గౌతమ్, బారాబంకీ ఎంపీ తనుజ్ పునియాలు మంగళవారం ఆమె ఇంటికి చేరుకుని, మాయావతిని కలిసేందుకు తమను అనుమతించాలని అభ్యర్థించారు. కానీ వీరిని కలిసేందుకు ఆమె సుముఖత వ్యక్తం చేయలేదని తెలుస్తోంది. మాయావతి ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి, ఆమెను మర్యాదపూర్వకంగా కలిసేందుకు తాము వచ్చినట్లు వారిద్దరు చెప్పుకున్నారు. మరోవైపు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సందేశాన్ని తెలియజేయడానికి వెళ్లినట్లు వస్తున్న వార్తల్ని వారు ఖండించారు.
ఈ పరిణామంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఇద్దరు నేతల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. షోకాజ్ నోటీసులు జారీ చేుసింది. ఇది అధికారిక పర్యటన కాదని చెప్పింది. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ మాట్లాడుతూ.. ఇలాంటి పర్యటనలు హైకమాండ్ ఆమోదంతోనే జరుగుతాయని, ముందుగానే నిర్ణయించబడుతాయని, ఈ పర్యటకు పార్టీ అనుమతి లేదని చెప్పారు.
2027 యూపీ ఎన్నికలకు ముందు మాయావతితో పొత్తు పెట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందనే వార్తలు గుప్పుమంటున్నాయి. మాయావతితో జతకడితే ముస్లిం, దళిత, ఓబీసీ ఓట్లు చీలకుండా అడ్డుకోవచ్చని, ఇది బీజేపీ విజయాన్ని అడ్డుకోవచ్చనే కాంగ్రెస్ ఇలాంటి ప్రయత్నాలు చేస్తుందనే వార్తలు వస్తున్నాయి.
