Uttar Pradesh: ఓవైసీతో పొత్తుకు కాంగ్రెస్ రెడీ..? యూపీలో కొత్త కూటమి..

  • 2027 యూపీ ఎన్నికల ముందు కాంగ్రెస్ కొత్త రాజకీయ వ్యూహం.
  • చంద్రశేఖర్ ఆజాద్, అసదుద్దీన్ ఒవైసీలతో పొత్తుకు ప్లాన్.
  • బీజేపీని ఒంటరిగా ఓడించలేమన్న కాంగ్రెస్ ఎంపీ.
  • ఎస్పీ-కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకాల్లో విభేదాలు..
Owaisi, Rahul Gandhi

Owaisi, Rahul Gandhi

Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు వచ్చే ఏడాది జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో పొత్తుల చర్చలు మొదలయ్యాయి. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) కలిసి పోటీ చేయాలని భావించాయి. అయితే, సీట్ల పంపకాలపై చర్చలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మరో కొత్త పొత్తుకు పావులు కదుపుతోంది. కాంగ్రెస్, అసదుద్దీన్ ఓవైసీ పార్టీ ఎంఐఎంతో, దళిత నాయకుడు చంద్రశేఖర్ ఆజాద్‌తో పొత్తు పెట్టుకోవడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ఓవైసీ, చంద్రశేఖర్ అజాద్ తన స్నేహితులుగా అభివర్ణించారు. యూపీలో బీజేపీని ఎవరూ ఒంటరిగా ఓడించలేరని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ మద్దతు లేకుండా బీజేపీని ఎవరూ ఓడించలేరని చెప్పారు. కొత్త పొత్తుల గురించి కాంగ్రెస్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. యూపీలో ఓవైపు ఎస్పీ మద్దతు వదులుకోవడానికి కాంగ్రెస్ సిద్ధంగా లేనప్పటికీ, మరోవైపు ఓవైసీ, ఆజాద్‌లను లైన్‌లో పెడుతున్నట్లు తెలుస్తోంది. ఓవైసీని తన అన్నయ్యగా మసూద్ పేర్కొన్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ మాత్రం ఎంఐఎంను బీజేపీ బీ-టీమ్ అని ఆరోపిస్తోంది.

×
×
Ad

అఖిలేష్‌పై ఒత్తిడి తీసుకురావడానికి కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ ఇలా మాట్లాడుతున్నారనే వాదన కూడా ఉంది. ఇప్పటికే ఎస్పీ-కాంగ్రెస్ మధ్య సీట్ల పంపిణీ వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో సీట్ల విషయంలో అఖిలేష్ యాదవ్ పార్టీపై మరింత ఒత్తిడి పెంచడానికి కాంగ్రెస్ ఇలాంటి ట్రిక్స్ ఉపయోగిస్తుందనే ఆరోపణ కూడా ఉంది. యూపీలో ఎస్పీ, కాంగ్రెస్ రెండింటికి ప్రధాన ఓటు బ్యాంక్ ముస్లింలే. విడివిడిగా పోటీ చేస్తే ఈ ఓట్లు చీలుతాయి. ఈ నేపథ్యంలో ఎస్పీని దారిలోకి తెచ్చుకోవడానికి కాంగ్రెస్ ఈ ఎత్తుగడను వాడుకుంటుందని భావిస్తున్నారు.