NTV Telugu Site icon

CM Yogi: మందిర్-మసీదు చర్చలో పాల్గొన్న యోగి ఆదిత్యనాథ్.. వక్ఫ్ బోర్డు మాఫియాపై ఫైర్!

Adhithya

Adhithya

CM Yogi: భారతదేశంలో అనేక దేవాలయాలు- మసీదుల వివాదాల పునరుద్ధరణపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ..వారసత్వాన్ని తిరిగి పొందడం చెడ్డ విషయం కాదు… ఇప్పుడు సంభాల్‌లోని షాహీ జామా మసీదులో సనాతన్ రుజువు కనిపిస్తుంది అన్నారు. మహా కుంభమేళాకు ముందు ఓ జాతీయ టీవీ నిర్వహించిన ధర్మ సంసద్ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మతపరమైన కార్యక్రమం జరుగుతున్న ప్రాంతం వక్ఫ్ ఆస్తి అనే వాదనలను కూడా ఈ సందర్భంగా తప్పుబట్టారు. ముస్లిం లీగ్ మనస్తత్వంతో భారతదేశం నడపబడదు అని పేర్కొన్నారు.

Read Also: Electricity Bill: ఓరి దేవుడా ఆ వ్యాపారికి ఏకంగా రూ. 210 కోట్ల కరెంట్ బిల్లు..

అలాగే, ఆలయ-మసీదు వివాదంపై ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆందోళన వ్యక్తం చేసిన కొద్ది రోజులకే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక, 2013లో మారిషస్‌ ప్రధాని గంగానదిలో పుణ్యస్నానం చేసేందుకు భారత్‌కు వచ్చినప్పుడు కుంభోత్సవం సందర్భంగా అపరిశుభ్రత, నిర్వహణ లోపం చూసి వెనక్కి వెళ్లిపోయారని ఆయన ఆరోపించారు. అయితే, అప్పుడు రాష్ట్రంలో సమాజ్‌వాదీ పార్టీ అధికారంలో ఉండగా, అఖిలేష్ యాదవ్ సీఎంగా ఉన్నారని గుర్తు చేశారు. మళ్లీ, మారిషస్ ప్రధాని 2019లో వారణాసిని సందర్శించినప్పుడు.. వారు కుంభమేళ జరుగుతున్న ప్రయాగ్‌రాజ్‌ను సందర్శించారు. ఆరేళ్లలో జరిగిన మార్పును చూసిన తర్వాత అతను తన కుటుంబంతో కలిసి సంగంలో పవిత్ర స్నానం చేశాడని యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు.

Read Also: Pawan Kalyan: వైకుంఠ ఏకాదశి వేళ.. పవన్ కళ్యాణ్ కీలక ట్వీట్..

ఇక, డబుల్ ఇంజన్ ప్రభుత్వం చేసిన కృషి వల్లే గంగానది పరిశుభ్రంగా మారిందని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. అలాగే, ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభ్‌ను వక్ఫ్‌ భూముల్లో నిర్వహిస్తున్నారని ఓ మత పెద్ద చెప్పడంతో వక్ఫ్‌ బోర్డుపై యూపీ సీఎం తీవ్రంగా విరుచుకుపడ్డాడు. ఇది వక్ఫ్ బోర్డు కాదని ల్యాండ్ మాఫియాల బోర్డు అని విమర్శలు గుప్పించారు. వక్ఫ్ సాకుతో తీసుకున్న ప్రతి అంగుళం భూమిని ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంటుందని ఆదిత్యనాథ్ ఉద్ఘాటించారు. అలాగే, ‘వక్ఫ్’ అనే పదం ఎక్కడ కనిపించినా, ఆ భూమిని అసలు ఎవరి పేరు మీద రిజిస్టరు చేశారనే దానిపై విచారణ చేసి.. దానిని నిజమైన యజమానులకు తిరిగి ఇచ్చేలా కృషి చేస్తామన్నారు.