CM KCR: హస్తినలో బీఆర్ఎస్ ఆఫీసును ప్రారంభించిన సీఎం కేసీఆర్‌.. ఏపీలో సంక్రాంతికి ఎంట్రీ

Cm Kcr

Cm Kcr

cm kcr inaugurates brs party office in delhi: దేశ రాజకీయాల్లో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. దేశంలో గుణాత్మక మార్పు కోసం పాటుపడిన తెలంగాణ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇవాళ ఢిల్లీలో పార్టీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించి, పార్టీ జాతీయ జెండాను కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు జాతీయ, రాష్ట్ర నేతలు అభినందనలు తెలిపారు. అనంతరం రాజ‌శ్యామ‌ల యాగం పూర్ణాహుతికి ముఖ్య‌మంత్రి కేసీఆర్ దంప‌తులు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ దంప‌తుల‌కు వేద పండితులు ఆశీర్వ‌చ‌నాలు అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి హాజరయ్యారు. మరోవైపు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన పార్టీ శ్రేణులు, ముఖ్య నేతలతో సందడి వాతావరణం నెలకొంది.

Read also: Balakrishna : ఏషియన్ తారకరామా థియేటర్ ప్రారంభించిన బాలయ్య

ఢిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయంలో సీఎం భార్య శోభ, ఎమ్మెల్సీ కవిత, మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, కొప్పుల ఈశ్వర్, ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎంపీ కవిత, హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి సందడి చేశారు. యాగం ముగిసిన వెంటనే కేసీఆర్ బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేసీఆర్ కార్యాలయంలోని తన ఛాంబర్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ సందడి నెలకొంది. తెలంగాణ ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ జాతీయ పార్టీగా అవతరించింది. బీఆర్ఎస్ పేరుతో జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ క్రమంగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు విస్తరించాలని యోచిస్తున్నారు. ఏపీలోనూ తమ సత్తా చాటాలని పట్టుదలతో ఉన్నారు. బీఆర్‌ఎస్ ఏపీ బాధ్యతలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు అప్పగించినట్లు సమాచారం. సంక్రాంతికి ఏపీలో బీఆర్ఎస్ అడుగుపెట్టబోతోంది. ఈ సందర్భంగా అమరావతిలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. బహిరంగ సభ బాధ్యతలను కూడా తలసానికి కేసీఆర్ అప్పగించారు. ఏపీ మూలాలున్న హైదరాబాద్‌లోని ప్రముఖులతో కేసీఆర్ ఇప్పటికే పరిచయం పెంచుకున్నారు. జాతీయ పార్టీ అధికారిక గుర్తింపు కోసం తెలుగు ప్రజలు మెజారిటీగా ఉన్న రాష్ట్రాల్లో ముందుగా పోటీ చేయాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. తొలి దశలో ఏపీ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు.
Congress Agitation in Telangana: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళన.. పలువురు అరెస్ట్‌