CJP: కేంద్రానికి సీజేపీ తాజా అల్టిమేటం.. సుప్రీంకోర్టు తీర్పుపై అసంతృప్తి..

  • విద్యార్థులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను వెంటనే ఉపసంహరించాలి
  • హామీలు అమలు కాకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరిక
  • సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై CJP అసంతృప్తి.
Cjp

Cjp

కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) కేంద్రానికి తాజాగా మంగళవారం మరో అల్టిమేటం ఇచ్చింది. నిరసనలకు సంబంధించిన పిటిషన్లపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత, విద్యార్థి నిరసనకారులపై ఎఫ్ఐఆర్‌లు ఉపసంహరించుకోవాలనే హామీపై కేంద్రం వెనక్కి తగ్గుతోందని సీజేపీ ఆరోపించింది. మంగళవారం లోగా కేసులు విత్ డ్రా చేసుకోకుంటే మళ్లీ దేశవ్యాప్తంగా నిరసన తెలుపుతామని హెచ్చరించింది.

మంగళవారం నీట్ పేపర్ లీక్ నిరసనల్లో అరెస్టైన వారిలో 18 ఏళ్లలోపు, నేర చరిత్ర లేని నిర్బంధంలో ఉన్న విద్యార్థులందరినీ విడుదల చేయాలని సుప్రీంకోర్టు రాష్ట్రాలను ఆదేశించింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద, ఇతర రాష్ట్రాలలో సీజేపీ నేతృత్వంలో జరిగిన నిరసనలకు సంబంధించి నమోదైన ఎఫ్‌ఐఆర్‌ల విషయంలో ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోరాదని కూడా అది ఆదేశించింది.

సుప్రీం ఆదేశాల ప్రకారం, ప్రభుత్వాలు ఇప్పటికే ఉన్న ఎఫ్ఐఆర్‌లపై దర్యాప్తు కొనసాగించవచ్చని సీజేపీ ఆందోళన వ్యక్తం చేసింది.శాంతియుతంగా నిరసన తెలిపిన వారిపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను ఉపసంహరిస్తామని, ఏ విద్యార్థిపైనా ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ శిక్షాత్మక చర్యలు తీసుకోబోమని కేంద్రం హామీ ఇచ్చిందని సీజేపీ చెబుతోంది. ఈ ఒప్పందాన్ని ప్రభుత్వ న్యాయవాదులు సుప్రీంకోర్టుకు ఎందుకు తెలియజేయలేదని సీజేపీ ప్రశ్నిస్తోంది.

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే, ‘‘పోలీసుల చేతిలో విద్యార్థుల వేధింపులు కొనసాగితే, బొద్దింకల జనతా పార్టీ త్వరలో భారీ శాంతియుత నిరసనతో స్పందిస్తుంది. ప్రభుత్వం విద్యార్థులను లక్ష్యంగా చేసుకోవడం మరియు వేధించడం ఆపాలి’’ అని ట్వీట్ చేశారు. ఇదే సమయంలో ఎఫ్ఐఆర్‌లు కొనసాగించాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాలను ఆదేశించలేదని సీజేపీ స్పష్టం చేసింది.