కేంద్ర ప్రభుత్వం మా డిమాండ్లను అంగీకరించిందని.. దీంతో ఆందోళనను విరమించుకుంటున్నట్లు సీజేపీ ప్రకటించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన కొద్దిసేపటికే శనివారం కేంద్ర పెద్దలతో సీజేపీ ప్రతినిధుల మధ్య కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం కేంద్రమంత్రులతో కలిసి సీజేపీ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. డిమాండ్లన్నింటినీ ప్రభుత్వం అంగీకరించిందని.. తాము తమ నిరసనను విరమించుకుంటున్నామని ప్రకటించింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న తమ డిమాండ్ను ఈ ఉదయం ప్రభుత్వం అంగీకరించిందని సీజేపీ ప్రతినిధి బృందం పేర్కొంది. మంగళవారం నాటికి తమ ఇతర డిమాండ్లను కూడా నెరవేరుస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపారు.
‘‘మేము ప్రభుత్వ ప్రతినిధి బృందంతో మూడు విడతలుగా చర్చలు జరిపాము. కొన్ని రోజులుగా జంతర్ మంతర్ దగ్గర మేము చేస్తున్న నిరసనలో మూడు ప్రధాన డిమాండ్లు ఉన్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, నిరసనకారులు, నిర్వాహకులపై దాఖలైన అన్ని చట్టపరమైన కేసులను ఉపసంహరించుకోవాలి. భవిష్యత్తులో నిరసనకారులు లేదా నిర్వాహకులపై ఎలాంటి కేసులు పెట్టకూడదు. నీట్ పరీక్ష వాయిదా పడటంతో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలన్నది మా మూడవ డిమాండ్. ధర్మేంద్ర ప్రధాన్ కొద్దిసేపటి క్రితమే రాజీనామా చేశారు. అంటే మా మొదటి డిమాండ్ అంగీకరించబడినట్టే.’’ అని జాతీయ అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా తెలిపారు.
కాన్స్టిట్యూషన్ క్లబ్లో జరిగిన సమావేశంలో కేంద్ర ప్రభుత్వం తరపున కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ హాజరుకాగా.. సీజేపీ ప్రతినిధి బృందంలో సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా ఉన్నారు. సీజేపీ ఆందోళనను విరమించుకున్న అనంతరం కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్, సీజేపీ ప్రధాన ప్రతినిధి సౌరవ్ దాస్, జాతీయ ప్రతినిధి అశుతోష్ రాంకాతో కరచాలనం చేశారు.

