West Bengal: బెంగాల్‌లో ‘కాక్రోచెస్’ వర్సెస్ బీజేపీ.. కార్యకర్త తండ్రి మృతితో సీజేపీ ఆగ్రహం

  • బెంగాల్లో సీజేపీ వర్సెస్ బీజేపీ..
  • సీజేపీ కార్యకర్త తండ్రి మరణంపై వివాదం..
  • బీజేపీ గుండాలే దాడులకు పాల్పడ్డారని సీజేపీ ఆరోపణ..
  • ప్రభుత్వం ముందు 4 డిమాండ్లు, 10 రోజుల అల్టిమేటం..
Bhp Vs Cjp

Bhp Vs Cjp

West Bengal: ఢిల్లీలో జంతర్ మంతర్ నిరసనల తర్వాత మరోసారి బీజేపీ వర్సెస్ కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. సీజేపీ ప్రారంభించిన ‘‘స్కూల్ ఠీక్ కరో’’ ప్రోగ్రాంలో పాల్గొన్నందుకు సీజేపీ కార్యకర్త షేక్ అబ్దుల్ హఫీజ్, ఆయన తండ్రిపై దాడి జరిగిందని సీజేపీ ఆరోపిస్తోంది. తీవ్రంగా గాయపడిన హఫీజ్ తండ్రి మాఫిక్ గత వారం మరణించారు. ఈ ఘటనపై సీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నాలుగు డిమాండ్లు నెరవేర్చాలని బెంగాల్‌లోని సువేందు అధికారి సర్కార్‌కు 10 రోజుల అల్టిమేటం విధించింది. లేదంటే జంతర్ మంతర్ తరహాలో భారీ ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు.

కోల్‌కతాకు 200 కి.మీ దూరంలోని బంకురా జిల్లాలో ఆగస్టు 13న సీజేపీ కార్యకర్త 27 ఏళ్ల షేక్ అబ్దుల్ హఫీజ్ తాను చదువుకున్న పాఠశాలను పరిశీలించడానికి వెళ్లారు. సీజేపీ చేపట్టిన ‘‘స్కూల్ ఠీక్ కరో’’ కార్యక్రమంలో భాగంగా పాఠశాలల సమస్యల్ని వెలుగులోకి తీసుకువచ్చారు. అదే రాత్రి 100 మంది నుంచి 200 మంది గుంపు తమ ఇంటికి వచ్చి స్కూల్ వీడియోలు డిలీట్ చేయాలని దాడి చేసినట్లు హఫీజ్ కుటుంబం ఆరోపిస్తోంది. ఈ దాడిలో హఫీజ్ తండ్రి తీవ్రంగా గాయపడి మరణించినట్లు బాధిత కుటుంబం చెబుతోంది.

ఈ ఘటనపై సీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. హఫీజ్‌పై బెదిరించి, దాడి చేసిన ఐదుగురి పేర్లపై బెంగాల్ పోలీసులు చర్యలు తీసుకోలేదని సీజేపీ ఆరోపిస్తోంది. నిందితుల్ని అరెస్ట్ చేయాలని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే డిమాండ్ చేశారు. సీజేపీ ప్రతినిధి అశుతోష్ రాంకా టీమ్ బంకురాలోని హఫీజ్ కుటుంబాన్ని కలిసింది. ఈ ఘటనలో 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు బీజేపీతో ఎలాంటి సంబంధం లేదని ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రకటించారు.

నిందితులందరిపై ఎఫ్ఐఆర్, పోలీసులు దురుసు ప్రవర్తనపై దర్యాప్తు, బాధిత కుటుంబానికి 24 గంటల భద్రత, హఫీజ్ తండ్రి పేరుతో పాఠశాల ఏర్పాటు చేయాలనే 4 డిమాండ్లను సీజేపీ బీజేపీ ప్రభుత్వం ముందుంచింది. ఈ డిమాండ్లు నెరవేర్చకపోతే బంకురా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని సీజేపీ హెచ్చరించింది. మరోవైపు, బీజేపీ కార్యకర్తల బెదిరింపులతో బంకురాలో నిర్వహించాల్సిన సమావేశాన్ని రద్దు చేయాల్సి వచ్చిందని సీజేపీ ప్రతినిధి అశుతోష్ రాంకా ఆరోపించారు.