Chhattisgarh: “మోడీ సార్ నా భార్యను మీరే కాపాడాలి”.. ఒమన్‌లో చిత్రహింసలకు గురవుతున్న భారతీయ మహిళ..

Oman

Oman

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌కి చెందిన ఓ మహిళ ఒమన్ దేశంలో నరకయాతన పడుతోంది. బతుకుదెరువు కోసం అక్కడికి వెళ్లిన సదరు మహిళను యజమాని చిత్రహింసలు పెడుతున్నారు. బందీగా ఉంచుకుని, వేరే వారికి అమ్మేందుకు ప్రయత్నిస్తున్నాడంటూ, తనను రక్షించాలని భారత ప్రభుత్వాన్ని వేడుకున్న మహిళ వీడియో వెలుగులోకి వచ్చింది. తన భార్యను ఒమన్‌ నుంచి కాపాడాలని మహిళ భర్త రాష్ట్ర పోలీసులను కోరాడు. ఆమెను విడిచిపెట్టేందుకు రూ. 2 లక్షలు- 3 లక్షలు కోరుతున్నట్లు జోగి ముఖేష్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టినట్లు దుర్గ్ పోలీస్ ఉన్నతాధికారి అభిషేక్ ఝా సోమవారం తెలిపారు. దీనిపై కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తామని ఆయన చెప్పారు.

Read Also: Iran: భారతీయు టూరిస్టులకు ఇరాన్ శుభవార్త.. ఇకపై వీసా లేకుండానే వెళ్లొచ్చు

బాధిత మహిళకి భిలాయ్(దుర్గ్)లోని ఖుర్సీపర్‌కి చెందిన వ్యక్తి ద్వారా హైదరాబాద్‌కి చెందిన ఏజెంట్ అబ్దుల్లాతో పరిచయం ఏర్పడింది. కేరళ ద్వారా ఆమెను అతను ఒమన్ పంపించినట్లు ఆమె భర్త ముఖేష్ వెల్లడించారు. ముందుగా ఏజెంట్ కేవలం తన భార్యను వంటపని చేస్తుందని చెప్పారని, ఆ తర్వాత ఇంటి పని చేయిస్తున్నారని అతను చెప్పాడు. తన భార్యను విడుదల చేసేందుకు రూ.2 లక్షల నుంచి రూ. 3 లక్షలు అడుగుతున్నాడని, నా భార్య భారత్ తిరిగి వచ్చేలా చూడాలని ప్రధాని సర్‌కి విజ్ఞప్తి చేస్తున్నానని అతను తెలిపాడు.

తన చిత్రహింసలపై మహిళ ఓ వీడియోను విడుదల చేసింది. అందులో ‘‘ సార్, నా పేరు దీపిక, నేను బిలాయ్‌కి చెందిన వ్యక్తి. నన్ను అబద్ధాలు చెప్పి ఇక్కడ ట్రాప్ చేశారు. నన్ను కొట్టారు. నన్ను ఇంటి నుంచి వెళ్లనివ్వాలని కోరితే, వారు లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. వారు నన్ను వేరొకరికి అమ్ముతామని చెబుతున్నారు. దయచేసి నన్ను రక్షించండి సార్.’’ అంటూ తన ఆవేదనను వెల్లడించింది.