CM Chandrababu: చెన్నైలో జరిగిన సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమిళనాడు రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రసిద్ధ డైలాగ్ను ప్రస్తావిస్తూ “డీఎంకే ఓడిపోవాలి… తమిళనాడు గెలవాలి… అర్థమైందా రాజా?” అంటూ సభలో ఉత్సాహం నింపారు. గత ఐదేళ్లుగా తమిళనాడులో స్వార్థ రాజకీయాలే కొనసాగుతున్నాయని విమర్శించారు. ఈ కాలంలో రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడిపోయిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల వేగంగా అభివృద్ధి జరుగుతోందని, తమిళనాడు కూడా అభివృద్ధి చెందాలంటే అలాంటి ప్రభుత్వమే రావాలని సూచించారు.
Read Also: Chandrababu Birthday: ఎవరూ ఆకలితో ఉండకూడదు.. ప్రతి ఒక్కరి కడుపు నిండాలన్నదే లక్ష్యం!
దేశానికి నీటి భద్రత కోసం గంగా-కావేరి అనుసంధానం అవసరమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో పరిస్థితులు అనుకూలిస్తే గోదావరి, కృష్ణా, కావేరి నదుల అనుసంధానం కూడా సాధ్యమవుతుందని చెప్పారు. ఈ మహత్తర ప్రాజెక్టులు ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోనే సాధ్యమవుతాయని పేర్కొన్నారు. తమిళనాడులో మళ్లీ పూర్వ వైభవం రావాలంటే National Democratic Alliance (NDA)ను గెలిపించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. సంక్షేమం, అభివృద్ధి రెండూ కావాలంటే కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు. చెన్నై ఎయిర్పోర్ట్, బెంగళూరు ఎయిర్పోర్ట్లను పోల్చి చూసి ఎవరికి ఓటు వేయాలో ప్రజలే నిర్ణయించుకోవాలని అన్నారు.
డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన చంద్రబాబు, అవినీతి లేని గ్రామం లేదని, నాశనం చేయని నగరం లేదని, నష్టం చూడని ప్రాంతం లేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తమిళనాడుకు ఇచ్చిన సహకారాన్ని డీఎంకే సద్వినియోగం చేసుకోలేదన్నారు. హిందూ ధర్మాన్ని కూడా డీఎంకే ఎగతాళి చేసిందని మండిపడ్డారు. డ్రగ్స్, అప్పుల భారం, దోపిడీలు, భూ కబ్జాలు తప్ప డీఎంకే సాధించిందేమీ లేదని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో నేరాలు 59 శాతం పెరిగాయని, మహిళలు, ఎస్సీ, ఎస్టీలపై దాడులు 39 శాతం పెరిగాయని ఆరోపించారు. 32 కస్టోడియల్ మరణాలు జరిగాయని, కల్తీ సారా కారణంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. మద్యం బాటిల్పై అదనంగా రూ.10 వసూలు చేస్తూ మందుబాబులను కూడా వదిలిపెట్టలేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. చివరగా తమిళనాడు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇలాంటి ప్రభుత్వాన్ని ఓడించి ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు..
