NTV Telugu Site icon

Chandigarh: బయటపడ్డ చండీగఢ్ రిటర్నింగ్ అధికారి బండారం

Mayar

Mayar

చండీగఢ్ మేయర్ ఎన్నిక సందర్భంగా రిటర్నింగ్ అధికారి చేసిన వ్యవహారానికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బ్యాలెట్ పత్రాలను అటు ఇటుగా మార్చేయడంతో పాటు కొన్నింటిని తప్పుగా చేసిన వ్యవహారం ఇప్పుడు బయటపడింది.

తాజాగా ఇదే వ్యవహారంపై సుప్రీంకోర్టు కూడా తీవ్రంగా ఆక్షేపించింది. ప్రజాస్వామ్యాన్ని మర్డర్ చేస్తారంటూ ధ్వజమెత్తింది. చండీగఢ్ మేయర్ ఎన్నికపై (Chandigarh Mayor Elections) దాఖలైన పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టు విచారించింది. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి తీరుపై (Returning Officer) ఫైర్ అయింది. చండీగఢ్ మేయర్ ఎన్నికకు సంబంధించిన వీడియోగ్రఫీ సహా అన్ని బ్యాలెట్ పత్రాలు, ఇతర ఒరిజినల్ రికార్డులను పంజాబ్-హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్‌కు అందజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రిటర్నింగ్ అధికారి బ్యాలెట్ పేపర్లను తారుమారు చేశాడని స్పష్టంగా తెలుస్తోంది? ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తారా? ప్రజాస్వామ్యాన్ని ఇలా ఖూనీ చేయడాన్ని అనుమతించబోమంటూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫిబ్రవరి 7న జరగాల్సిన చండీగఢ్ మునిసిపల్ కార్పొరేషన్ సమావేశాన్ని వాయిదా వేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.

ఇదే అంశంపై ప్రియాంక ట్వీట్..
చండీగఢ్ ఉదంతాన్ని ఉటంకిస్తూ కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. మేయర్ ఎన్నికల్లో జరిగిన ఎన్నికల మోసాన్ని ధర్మాసనం ఖండించిందని.. ప్రజాస్వామ్యాన్ని అపహ్యాసం చేసినట్లుగా చీవాట్లు పెట్టిందని గుర్తుచేశారు. ప్రజల గొంతును అణిచివేసేందుకు బీజేపీ ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తోందని.. ప్రజలు దీనికి సమాధానం చెబుతారని ప్రియాంక ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు.

ఇటీవల చండీగఢ్‌ మేయర్‌ ఎన్నికల్లో జిమ్మిక్ జరిగింది. ఇండియా కూటమిగా బరిలో దిగిన ఆప్‌, కాంగ్రెస్‌ పార్టీలకు 20 మంది (13+7) కార్పొరేటర్లు ఉన్నారు. బీజేపీకి చెందిన మనోజ్‌ కుమార్‌ సోలంకి కేవలం 16 ఓట్లే ఉన్నాయి. కానీ బీజేపీ అభ్యర్థే మేయర్‌గా ఎన్నికయ్యాడు. దీంతో ఇండియా కూటమి అవాక్కైంది.

ఆప్‌ అభ్యర్థి కుల్‌దీప్‌ కుమార్‌కు 20 మంది మద్దతు ఉన్నా.. 12 ఓట్లే వచ్చాయి. కూటమికి చెందిన 8 ఓట్లు చెల్లలేదని అధికారి ప్రకటించారు. దీంతో ఆగ్రహించిన ఆప్‌, కాంగ్రెస్‌ సభ్యులు కార్పొరేషన్‌ కార్యాలయంలో ఆందోళనకు దిగారు. రిటర్నింగ్ అధికారి తీరుపై మండిపడ్డారు. అనంతరం హైకోర్టును ఆశ్రయించగా ఈ అంశాన్ని పట్టించుకోలేదు. దీంతో ఆప్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సోమవారం దీనిపై విచారణ చేపట్టి ప్రిసైడింగ్‌ అధికారి తీరుపై మండిపడింది.