Indian Navy: భారత ప్రభుత్వం రక్షణ రంగానికి ఎక్కువగా నిధులు కేటాయిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయించగా.. ఇప్పుడు యుద్ధ నౌకలను దేశంలోనే తయారు చేయాలని నిర్ణయించింది. యుద్ధనౌకల తయారీ ప్రాజెక్టకు కేంద్రం ఆమోదం తెలిపింది. భారత నావికాదళానికి ప్రోత్సాహంగా నౌకల్లో ఇంధనం, ఆహారం, మందుగుండు సామగ్రిని నింపడానికి సహాయపడే ఐదు ఫ్లీట్ సపోర్ట్ నౌకలను నిర్మించే ప్రాజెక్టుకు కేంద్రం బుధవారం అనుమతి ఇచ్చింది. ఈ ఐదు నౌకలను రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నిర్మించనుంది. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించే నౌకలు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఆత్మనిర్భరత లేదా భారత నౌకాదళ స్వావలంబన లక్ష్యాలను పెంచుతాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. నౌకాదళ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఉద్దేశించిన రూ.20,000 కోట్ల ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
Read also: Nidhi Agerwal: అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈరోజు అది చూసే వాళ్లం
భారత నావికాదళ పరాక్రమాన్ని బలోపేతం చేయడంలో ఇది కీలక పాత్ర పోషించనున్నాయి. సముద్రాలలో మోహరించే సమయంలో ఆహారం, ఇంధనం, మందుగుండు సామగ్రితో సహా అవసరమైన సామాగ్రిని అందించడం ద్వారా వివిధ నౌకాదళాలకు సేవలు అందిస్తాయి. ఈ ప్రాజెక్టు హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ కు కూడా గణనీయమైన ప్రయోజనాలను అందించనుంది. చిన్న, మధ్యతరహా పరిశ్రమలతో సహా అనేక భాగస్వాములతో కూడిన సహకార ప్రయత్నాల ద్వారా అమలు చేయబడే ఈ స్మారక ఆర్డర్ ను అందుకోవడానికి కంపెనీ సిద్ధంగా ఉంది. రానున్న 10 ఏళ్లల్లో ఈ ఐదు నౌకలు సిద్ధమవుతాయని రక్షణ రంగం భావిస్తోంది. సుమారు రూ.20 వేల కోట్ల ప్రాజెక్టుకు బుధవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో కేంద్ర ప్రభుత్వం తుది అనుమతి ఇచ్చింది. ఐదు ఫ్లీట్ సపోర్ట్ షిప్ లను హెచ్ఎస్ఎల్ అనేక భారతీయ ప్రైవేట్ రంగ చిన్న, మధ్యతరహా సంస్థల మద్దతుతో నిర్మిస్తుందని ప్రభుత్వ రక్షణ వర్గాలు తెలిపినట్టు ఏఎన్ఐ ప్రకటించింది. ఈ ప్రాజెక్టు వల్ల వేలాది కొత్త ఉద్యోగాలు వస్తాయనీ, ప్రాజెక్టుతో ముడిపడి ఉన్న పరిశ్రమల సామర్థ్యాలు పెరుగుతాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. నావికాదళంలోని వివిధ ఫ్లీట్లకు చెందిన యుద్ధనౌకలు కార్యకలాపాల సమయంలో ఎల్లప్పుడూ పనిచేయడానికి ఎఫ్ఎస్ఎస్ ఇంధనం, ఆహారం, మందుగుండు సామగ్రి, విడిభాగాలను అందిస్తుంది.
ప్రణాళిక ప్రకారం.. హెచ్ఎస్ఎల్ దాదాపు ఎనిమిదేళ్లలో అన్ని షిప్లను డెలివరీ చేయనుంది. ఒక్కో నౌక దాదాపు 45,000 టన్నుల బరువు ఉంటుంది. హెచ్ఎస్ఎల్ను ఐదు ఫ్లీట్ సపోర్ట్ షిప్ల నిర్మాణం కోసం ఇండియన్ నేవీ నామినేట్ చేసింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే నావికాదళంలో ఇండియా ముందు వరుసలో నిలిచే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.