కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అసోం సీఎంపై హైదరాబాద్లో కేసు నమోదు చేశారు. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. మహిళలను అవమానించేలా మాట్లాడిన హేమంతపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రేవంత్ సోమవారం పోలీసులను కోరిన సంగతి తెలిసిందే. 48గంటల పాటు చూస్తామని.. అప్పటి వరకు కేసులు పెట్టకపోతే పోలీస్ స్టేషన్ లు ముట్టడిస్తామన్నారు. ఈ నెల 16వ తేదీ 12 గంటల లోపు అసోం సీఎంను అరెస్ట్ చేయాలన్నారు రేవంత్ రెడ్డి.
సీఎం ఒత్తిడి చేయకుంటే పోలీసులు FIRలు నమోదు చేస్తారన్నారు. ఫిబ్రవరి 11 న అస్సాం సీఎం హేమంత బిశ్వ శర్మ.. మహిళా లోకాన్ని కించపరిచేలా మాట్లాడారన్నారు. ఎన్నికల ప్రచారంలో అసభ్యకరంగా కామెంట్స్ చేశాడని.. రాజ్యాంగంపై ప్రమాణం చేసి సీఎం పదవిలో ఉన్న హేమంత బిశ్వశర్మ అలా మాట్లాడ్డం సిగ్గు చేటు అన్నారు. అసోం రాష్ట్ర డీజీపీ.. కేంద్ర ఎన్నికల సంఘానికి రిపోర్ట్ రాసి పంపిస్తారని అనుకున్నాం కానీ అలా జరగలేదన్నారు.
వెంటనే హేమంత పై క్రిమినల్ కేసు నమోదు చేసి, సీఎం పదవి నుండి బర్తరఫ్ చేయాలన్నారు. హేమంత కామెంట్స్ ను కేంద్రం సీరియస్ గా తీసుకొని దేశ సంస్కృతీ ని కాపాడుతుందని అనుకున్నామని..అలా చేయకపోవడంతో తెలంగాణలోని పీఎస్ లలో ఫిర్యాదులు చేశారు. ఇది ఒక సోనియాకు జరిగిన అవమానమే కాదు.. దేశంలోని మాతృమూర్తులకు జరిగిన అవమానం అన్నారు. ఈ వ్యవహారంపై సీఎం కేసీఆర్ కూడా సీరియస్ గా స్పందించిన సంగతి తెలిసిందే.
