పెళ్లి.. జీవితంలో అత్యంత వైభవంగా జరుపుకునే వేడుక. పేదోడైనా.. సామాన్యుడైనా.. ధనవంతుడైనా తమ స్థాయికి తగ్గట్టుగా గ్రాండ్గా వివాహాలు జరిపిస్తుంటారు. ఉత్తరప్రదేశ్లో కూడా అలాగే అత్యంత వైభవంగా పెళ్లి వేడుక జరుగుతోంది. బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులతో సందడి సందడిగా మండపం కళకళలాడుతోంది. హిందూ సాంప్రదాయం ప్రకారం ఆచారాలు జరుగుతున్నాయి. వధువరూలిద్దరూ కూడా దండలు కూడా మార్చుకున్నారు. స్టేజ్పై చక్కగా నడిచారు కూడా. ఇంతలో ఏమైందో.. ఏమో తెలియదు.. తాళి కట్టే సమయంలో ఒక్కసారిగా వధువు షాకిచ్చింది. పెళ్లి చేసుకోనని మొండికేసింది. దీంతో అంతా నిశ్శబ్దంగా మారిపోయింది. అసలేం జరిగిందో తెలియాలంటే ఈ వార్త చదవండి.
ఉత్తరప్రదేశ్లోని కౌశాంబి జిల్లా పశ్చిమషరీర పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ఒక గ్రామంలో గ్రాండ్గా వివాహ వేడుకలు జరుగుతున్నాయి. బంధువులు, గ్రామస్తులంతా పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రయాగ్రాజ్లోని కథుల నుంచి వరుడు భారీ ఊరేగింపుతో మండపానికి వచ్చాడు. వధువు కూడా భారీ ఊరేగింపుతోనే మండపానికి చేరుకుంది. ఇంటి వెలుపల లైటింగ్, డీజే సౌండ్లు, నృత్యాలు అబ్బో.. సందడి మామూలుగా లేదు. ఇక స్టేజ్పైకి పిలవగానే వధూవరులు దండలు కూడా మార్చుకున్నారు. చప్పట్లు, కేరింతలతో సందడిగా సాగుతోంది. ఇక తాళి కట్టడమే ఆలస్యం. ఇంతలోనే వధువు బాంబ్ పేల్చింది. ఈ పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని ప్రకటించింది. అంతే అందరూ నోరెళ్లబెట్టారు. అమ్మాయి మాటలకు అంతా షాక్కు గురయ్యారు.
వేదికపై నిశ్శబ్దం అలుముకుంది. వరుడి కుటుంబం అయితే అవాక్కైంది. దీంతో ఇరువైపుల బంధువులు, గ్రామ పెద్దలు రంగంలోకి దిగి అర్ధరాత్రి వరకు పంచాయితీ నిర్వహించారు. అమ్మాయిను ఒప్పించేందుకు శతవిధాలా ప్రయత్నించారు. కానీ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. పెళ్లి చేసుకునేందుకు ససేమిరా అంది. రక్తసంబంధికులు ఎంత నచ్చజెప్పినా వినలేదు. ఇక చేసేదేమీలేక ఇరువర్గాలు పరస్పరం వేడుకను రద్దు చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఎటువంటి గొడవలు, గందరగోళం లేకుండా ఎవరి దారిన వారు వెళ్లిపోయారు.
అయితే వధువు అప్పటికే మరొక వ్యక్తితో సంబంధం ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. అందుకే పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిందని చెప్పుకొంటున్నారు. అయితే ఈ వాదనలను అధికారికంగా ఎవరూ ధృవీకరించలేదు. ఇక ఈ ఘటనపై ఇరు పక్షాల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెప్పారు.
