NTV Telugu Site icon

Madhya Pradesh: ప్రాణాలు తీసిన డీజే.. డ్యాన్స్ చేస్తూ 13 ఏళ్ల బాలుడు మృతి

Djsound

Djsound

ఈ మధ్య సమాజంలోకి పాడు సంస్కృతి ప్రవేశించింది. ఉల్లాసమైనా, ఆనందమైనా పరిధిలో ఉండాలి. అది శృతిమించితే దు:ఖమే మిగులుతుంది. ఇప్పుడు ఏ శుభకార్యం జరిగినా.. ఏ పండుగ వచ్చినా మొట్టమొదటిగా గుర్తొచ్చేది డీజే సౌండే. ఏ చిన్న కార్యక్రమం జరిగినా నిర్వాహకులు డీజే సౌండ్‌నే బుక్ చేస్తున్నారు. కానీ దాని ప్రభావం కొందరి కుటుంబాల్లో విషాదం నింపుతుందన్న విచక్షణ ఎవరికీ ఉండడం లేదు. ఏ శబ్దమైనా లిమిట్‌లోనే ఉండాలి. అంతకు మించితే ప్రాణాలే పోతాయి. ఇదంతా ఎందుకుంటారా? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో స్థానిక పండుగ జరుగుతోంది. ఈ వేడుకలో నిర్వాహకులు డీజే సౌండ్ ఏర్పాటు చేశారు. అందరూ ఉత్సాహంగా కేరింతలు కొడుతూ గంతులు వేస్తున్నారు. అక్కడే ఉన్న సమర్‌ బిల్లోర్‌ అనే బాలుడి(13)కి కూడా ఊపు వచ్చింది. ఏ మాత్రం ఆలస్యంగా చేయకుండా వారి మధ్యలోకి దూరి ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్నాడు. అయితే డీజే సౌండ్‌కి బాలుడి గుండె తట్టుకోలేకపోయింది. అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఇంత జరిగినా మిగతా వారు డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు. బాలుడి తల్లి గమనించి.. సౌండ్ ఆపమని ప్రాధేయపడినా ఎవరూ పట్టించుకోలేదు. వెంటనే తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే బాలుడు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. డీజే సౌండ్ కారణంగా గుండె పోటు వచ్చి ప్రాణాలు పోయాయని డాక్టర్లు చెప్పారు. దీంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

డీజే సౌండ్ ఎక్కువగా ఉండడంతోనే తన కొడుకు ప్రాణాలు పోయాయని సమర్ తండ్రి కైలాష్ బిల్లోర్ ఆవేదన వ్యక్తం చేశాడు. తన కొడుకు మృతికి డీజేనే కారణమని ఆరోపించాడు. ఎన్నిసార్లు హెచ్చరించినా ఆగలేదని, తమ అబ్బాయి ప్రాణం పోయినా ఆ సందడిని ఏదీ ఆపలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పండుగల సమయంలో ఇలాంటి సౌండ్‌ సిస్టమ్స్‌ నుంచి వచ్చే పెద్ద పెద్ద శబ్దాల కారణంగా ఇంట్లోని రోగులు, పిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయాడు.

ఇదిలా ఉంటే హైదరాబాద్‌లో డీజే సౌండ్ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీని మీద పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో నగరంలో డీజే సౌండ్‌ను పోలీసులు నిషేధం విధించారు. డీజే సౌండ్ కారణంగా పిల్లలు, వృద్ధులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అనారోగ్యం పాలవుతున్నారు.