ముంబైలో కోవిడ్ కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) సోమవారం పౌరులకు విజ్ఞప్తి చేసింది. అయితే సింధుదుర్గ్, డోంబివ్లికి చెందిన ఇద్దరు మహిళలు ఆదివారం ముంబై నగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. వీరిద్దరు కోవిడ్ కారణంగా చనిపోయినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే సింగపూర్, హాంకాంగ్, తూర్పు ఆసియా మరియు ఇతర దేశాల్లో కోవిడ్-19 కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇద్దరు మహిళలు కూడా కరోనా కారణంగానే చనిపోయినట్లు ప్రచారం జరగడంపై బీఎంసీ స్పందించింది. ఇద్దరు మహిళలు కోవిడ్ కారణంగా చనిపోలేదని.. హైపోకాల్సెమిక్ మూర్ఛలతో నెఫ్రోటిక్ సిండ్రోమ్, క్యాన్సర్ కారణంగా మరణించారని పేర్కొంది. దయచేసి ప్రజలు భయపడొద్దని కోరింది. తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని విజ్ఞప్తి చేసింది.
ఇది కూడా చదవండి: UK Professor: భారత వ్యతిరేక కార్యకలాపాలతో విదేశీ పౌరసత్వాన్ని కోల్పోయా..
కోవిడ్-19 వ్యాప్తిని అదుపులో ఉంచడానికి బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఆరోగ్య విభాగం నిరంతరం పర్యవేక్షిస్తోందని అధికారులు తెలిపారు. జనవరి 2025 నుంచి ఏప్రిల్ 2025 వరకు కోవిడ్-19 రోగుల సంఖ్య చాలా తక్కువగా ఉందని తెలిపింది. మే నుంచి కొంతమంది రోగులు కనిపించారని.. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పరిపాలన ఈ విషయంలో భయపడవద్దని పౌరులకు విజ్ఞప్తి చేసింది. సెవెన్ హిల్స్ హాస్పిటల్లో 20 పడకలు (MICU), పిల్లలు మరియు గర్భిణీ స్త్రీలకు 20 పడకలు మరియు 60 సాధారణ పడకలు ఉన్నాయని వెల్లడించింది.
ఇది కూడా చదవండి: Vizag Deputy Mayor: ఎట్టకేలకు విశాఖ డిప్యూటీ మేయర్ ఎన్నిక ఏకగ్రీవం..
సరైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కోవిడ్-19 ను నివారించవచ్చని బీఎంసీ తెలిపింది. ముఖ్యంగా క్యాన్సర్, వృద్ధులు, మధుమేహం, అధిక రక్తపోటు మరియు కాలేయ వ్యాధి వంటి తీవ్రమైన అనారోగ్యాలు మరియు తక్కువ రోగనిరోధక శక్తి ఉన్న రోగులు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. జ్వరం, దగ్గు (పొడి లేదా కఫంతో), గొంతు నొప్పి, అలసట, శరీర నొప్పులు మరియు తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే మున్సిపల్ క్లినిక్, ఆసుపత్రి లేదా కుటుంబ వైద్యుడిని సంప్రదించాలని BMC పౌరులను కోరింది. లక్షణాలు కనిపిస్తే బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించాలని, ఇతరుల నుంచి దూరం పాటించాలని, సబ్బు మరియు నీటితో తరచుగా చేతులు కడుక్కోవాలని, సరైన ఆహారం పాటించాలని మరియు విశ్రాంతి తీసుకోవాలని పౌరులకు విజ్ఞప్తి చేసింది.