West Bengal: పశ్చిమ బెంగాల్లో మసీదుల్లో లౌడ్ స్పీకర్ల వివాదం కొనసాగుతోంది. రాష్ట్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ అధికారులు మసీదు నిర్వాహకులను లౌడ్ స్పీకర్లు తొలగించాలని మౌఖికంగా సూచిస్తున్నారనే ముస్లిం నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, ప్రభుత్వం నుంచి దీనిపై ఎలాంటి లిఖితపూర్వక ఉత్తర్వులు లేవని, మసీదు కమిటీలకు స్థానిక పోలీసుల నుంచి ఆదేశాలు అందాయని తెలుస్తోంది. ఈ వివాదంపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడుతామని ముస్లిం నేతలు హెచ్చరిస్తు్న్నారు.
తృణమూల్ కాంగ్రెస్లోని రితబ్రతా బెనర్జీ వర్గం ఈ అంశాన్ని శుక్రవారం ముఖ్యమంత్రి సువేందు అధికారి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపింది. మరోవైపు ఈ పంచాయతీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముందుకు చేరింది. టీఎంసీ నుంచి తిరుగుబాటు చేసి, ఎన్డీయే సర్కార్కు మద్దతు ఇస్తున్న ముగ్గురు ముస్లిం ఎంపీలు అమిత్ షాను కలిశారు. యూసుఫ్ పఠాన్, ఖలీలుర్ రెహమాన్, అబూ తాహెర్ ఖాన్లు అమిత్ షాకు వినతి పత్రాన్ని సమర్పించారు.
ఈ వివాదంపై టీఎంసీ ఎమ్మెల్యే అఖ్రుజ్జమాన్ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగంలో ప్రతీ ఒక్కరికీ తమ మతాన్ని స్వేచ్ఛగా ఆచరించే హక్కు ఉందని, హిందువులు ఆలయాల్లో పూజలు చేసుకునే హక్కు ఉన్నట్లే, ముస్లింలకు మసీదుల్లో అజాన్ చెప్పి నమాజ్ చేసుకునే హక్కు ఉందని అన్నారు. జమియత్ ఉలేమా-ఎ-హింద్ బెంగాల్ అధ్యక్షుడు సిద్ధీకుల్లా చౌధురి కూడా ఈ అంశంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు మసీదుల నిర్వాహకులపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపిస్తూ, సమస్య పరిష్కారం కాకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

