NTV Telugu Site icon

Bangladesh Crisis: బంగ్లాదేశ్ ఎజెండా.. జైశంకర్, అజిత్ దోవల్‌ని కలిసిన అమిత్ షా..

Amit Shah

Amit Shah

Bangladesh Crisis: బంగ్లాదేశ్ పరిణామాలు భారత్‌కి ఆందోళనకరంగా మారాయి. భారత్ అనుకూల నేత షేక్ హసీనాను దేశం వదిలిపారిపోయేలా అక్కడ హింస చెలరేగింది. ప్రస్తుతం ఆమె భారత్ రక్షణలో ఉన్నారు. త్వరలోనే యూకేలో ఆశ్రయం పొందేందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారత్‌తో అతిపెద్ద సరిహద్దును పంచుకుంటున్న బంగ్లాదేశ్‌లో అస్థిర పరిస్థితులు భారత్‌కి ఇబ్బందికరంగా మారాయి. దీనికి తోడు తాత్కాలిక ప్రభుత్వంలో చేరబోతున్న ఖలిదా జియా ఆమెకు సంబంధించిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్‌పీ), జమాతే ఇస్లామీ పార్టీ రెండూ భారత వ్యతిరేక ధోరణులను అవలంభించే. ఇన్నాళ్లు షేక్ హసీనా పాలనలో ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేసింది. రానున్న ప్రభుత్వంలో ఈ రాడికల్ ఉగ్రవాద సంస్థలకు పూర్తి మద్దతు లభించే అవకాశ ఉంది. ఈ నేపథ్యంలోనే భారత్ హైఅలర్ట్ ప్రకటించింది.

Read Also: Karnataka: ప్రేమను తిరస్కరించిందని యువతిపై దాడి.. ఆ తర్వాత నిందితుడు ఏం చేశాడంటే..!

తాజాగా బంగ్లాదేశ్ లో నెలకొన్న పరిస్థితులపై, శాంతిభద్రతలపై చర్చించేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ రోజు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో సమావేశమయ్యారు. నిన్న షేక్ హసీనా ఢాకా నుంచి ఢిల్లీ రావడంతో బంగ్లా సరిహద్దుల్లో భద్రతను పటిష్టం చేశారు. అక్రమ వలసలపై నిఘా పెట్టడంతో పాటు బంగ్లాలో నివసిస్తు్న్న భారతీయులు, మైనారిటీలైన హిందువుల పరిస్థితిపై ఆందోళన నెలకొంది.

బంగ్లాదేశ్‌లో దాదాపుగా 19,000 మంది భారతీయులు నివసిస్తున్నారు. దాదాపుగా 17 కోట్ల మంది జనాభాలో కోటికి పైగా హిందువులు ఉన్నారు. ఈ రోజు రాజ్యసభలో మాట్లాడిన జైశంకర్ అక్కడి పరిస్థితులు మైనారిటీలు, భారతీయుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆ దేశంలో హిందువులను టార్గెట్ చేస్తూ దాడులు, హత్యలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఇద్దరు హిందూ కౌన్సిలర్లను మతోన్మాద మూకలు హత్య చేశాయి. చాలా చోట్ల హిందూ ఆలయాలపై దాడులు నిర్వహిస్తున్నారు. చాలా చోట్ల హిందూ మహిళలు, యువతులపై అకృత్యాలకు తెగబడుతున్నట్లు తెలుస్తోంది.