Attacks on Indians abroad: విదేశాల్లో నివసిస్తున్న భారతీయులపై దాడులు పెరిగాయి. గత 5 ఏళ్లలో ఏడు రెట్లు దాడులు పెరిగినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2021లో భారతీయులపై 15 దాడులు నమోదు కాగా, 2025లో ఇది 104కు చేరింది. రాజ్యసభలో విదేశాంగ మంత్రిత్వ శాఖ 36 దేశాలకు సంబంధించిన గణాంకాలను వెల్లడించింది. అత్యధికంగా అమెరికాలో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ), యునైటెడ్ కింగ్డమ్(యూకే), కెనడాల్లో దాడులు జరిగాయి.
2021-25 మధ్య మొత్తం 302 దాడులు నమోదయ్యాయి. 2021లో 15, 2022లో 31, 2023లో 67, 2024లో 85, 2025లో 104 దాడులు జరిగాయి. అమెరికాలో గత ఐదేళ్లలో అత్యధికంగా 33 దాడులు జరిగాయి. ఆ తర్వాత యూఏఈలో 32, యూకేలో 31, కెనడాలో 30, ఐర్లాండ్లో 24, రష్యాలో 23, జర్మనీలో 19 ఘటనలు నమోదయ్యాయి.
విదేశాల్లో భారతీయులపై జరుగుతున్న దాడులపై అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ స్పందించారు. విదేశాల్లో భారతీయుల భద్రత, రక్షణ భారత ‘‘అత్యంత ప్రాధాన్యత’’ అని చెప్పారు. ఇలాంటి సంఘటనలు జరిగిన వెంటనే ఆ దేశ అధికారుల దృష్టికి తీసుకెళ్లి, సమగ్ర విచారణ జరిగేలా, నిందితులకు ఆ దేశ చట్టాల ప్రకారం శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

