Assembly Elections Results 2026: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు నేటితో తేలనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు. తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ, పుదుచ్చేరి, అస్సాం అసెంబ్లీకు జరిగిన ఎన్నికలు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాయి. ఈ ఎన్నికల్లో రికార్డ్ స్థాయి ఓటింగ్ నమోదైంది.
అస్సాం, కేరళ, పుదుచ్చేరిలలో ఏప్రిల్ 9న పోలింగ్ జరగ్గా, తమిళనాడులో కూడా ఏప్రిల్ 23న ఒకే దశలో పోలింగ్ నిర్వహించారు. బెంగాల్లో రెండు దశల్లో మొదటి దశ ఏప్రిల్ 23న జరిగింది. రెండో దశ బుధవారం(ఏప్రిల్29)న జరిగింది. వెస్ట్ బెంగాల్లో 294, అస్సాంలో 126, తమిళనాడులో 234, కేరళలో 140, పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా ఎక్కువగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికల ఫలితాలపై ఆసక్తి నెలకొంది. ఈ రెండు రాష్ట్రాల గెలుపుపోటములపై ప్రజలు దృష్టి నెలకొంది.
ఏప్రిల్ 29న విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం.. కేరళలో అన్ని ఎగ్జిట్ పోల్స్ దాదాపుగా కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి గెలుస్తుందని, పుదుచ్చేరిలో ఎన్డీయే కూటమి, అస్సాంలో బీజేపీ గెలుస్తాయని అంచనా వేశాయి. అయితే, తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే, విజయ్ టీవీకే మధ్య టఫ్ ఫైట్ నెలకొన్నట్లు సర్వే సంస్థలు చెప్పాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్ డీఎంకే గెలుస్తుందని అంచనా వేయగా, మరొకొన్ని అన్నాడీఎంకేకు మద్దతు ఇచ్చారు. యాక్సిస్ మై ఇండియా వంటి ఎగ్జిట్ పోల్స్ ఏకంగా టీవీకే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పింది. ఈ నేపథ్యంలో ద్రవిడ నాట ఎవరు అధికారం చేపడుతారనే దానిపై ఈ రోజు స్పష్టత వస్తోంది.
మరోవైపు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు మరింత ఆసక్తిగా మారాయి. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంకే, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నడిచినట్లు అన్ని సర్వేలు చెప్పాయి. అయితే, ఎగ్జిట్ పోల్స్లో బీజేపీకి కాస్త ఎడ్జ్ ఉన్నప్పటికీ, తృణమూల్ కాంగ్రెస్ కూడా గెలుస్తుందని ఒకటి రెండు సర్వే సంస్థలు వెల్లడించడంతో రిజల్ట్స్ పట్ల ఆసక్తి నెలకొంది.
