Himanta Biswa Sarma: కాంగ్రెస్‌కి బాబర్ అంటేనే ప్రేమ.. రాముడిపై కాదు..

Himanta Biswa Sarma

Himanta Biswa Sarma

Himanta Biswa Sarma: రామ మందిర ప్రారంభోత్సవం ఈ నెల 22న జరగబోతోంది. ఈ వేడకకు ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నారు. దేశంలోని వివిధ రంగాల్లో ప్రముఖులు 7000 మంది అతిథులుగా రాబోతున్నారు. ఇప్పటికే అయోధ్య నగరం ఈ వేడుక కోసం ముస్తాబైంది. యూపీతో పాటు దేశమంతట పండగ వాతావరణం నెలకొంది. ఇదిలా ఉంటే ఈ వేడుకకు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలైన మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, అధిర్ రంజన్ చౌదరిలను ఆహ్మానించినప్పటికీ తాము రాబోవడం లేదని ఆ పార్టీ స్పష్టం చేసింది. రామ మందిర వేడుకలు పూర్తిగా బీజేపీ/ఆర్ఎస్ఎస్ సొంత కార్యక్రమంలా జరుగుతోందని విమర్శించింది.

Read Also: POK: పీఓకేలో పర్యటించిన బ్రిటిష్ రాయబారి.. భారత్ తీవ్ర అభ్యంతరం..

ఇదిలా ఉంటే కాంగ్రెస్ ఆహ్వానాన్ని తిరస్కరించడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అస్సాం సీఎం హిమంత బిశ్వ సర్మ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ బాబర్‌ని ప్రేమిస్తుంది కానీ రాముడంటే ప్రేమ లేదని అన్నారు. వారిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించడమే తప్పని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. రాముడు, బాబర్ పక్కపక్కన ఉంటే.. వారు ముందుగా బాబార్‌కే నమస్కరిస్తారని విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ తన పాపాలను తగ్గించుకోవడానికి విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) ఒక అవకాశాన్ని ఇచ్చిందని, అయితే ఆ పార్టీ మాత్రం ఈ అవకాశాన్ని వదులుకుందని అన్నారు. నెహ్రూ నుంచి రాహుల్ గాంధీ వరకు రామమందిరాన్ని వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. వీరంతా ఆఫ్ఘనిస్తాన్ వెళ్లి బాబార్ సమాధిని దర్శిస్తారు తప్పితే రామమందిరానికి రారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు హిమంత బిశ్వ సర్మ మాట్లాడుతూ.. గతంలో సోమనాథ్ ఆలయ విషయంలో జవహర్ లాల్ నెహ్రూ చేసిన విధంగానే, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రామమందిర విషయంలో వ్యవహరిస్తోందని విమర్శించారు.