పేపర్ లీక్లను అరికట్టేందుకు ఉద్దేశించిన పబ్లిక్ ఎగ్జామినేషన్ (Prevention of unfair practices) సవరణ బిల్లు-2026కు పార్లమెంట్ ఆమోదం లభించడాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వాగతించారు. దేశంలో పరీక్షా వ్యవస్థను మరింత పటిష్ఠంగా, విశ్వసనీయంగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. గురువారం సోషల్ మీడియా ద్వారా విడుదల చేసిన సెల్ఫీ వీడియోలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. పేపర్ లీక్ ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం వెనక్కి తగ్గదని స్పష్టం చేశారు. పార్లమెంట్ ఈ బిల్లును ఆమోదించడం దేశానికి ఒక చారిత్రాత్మక సందర్భమని పేర్కొన్నారు.
పరీక్షా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాం
దేశంలో పరీక్షల నిర్వహణలో మరిన్ని సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని ప్రధాని అన్నారు. గతంలో అనేక రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పేపర్ లీక్ ఘటనలను ఎదుర్కొన్నాయని, అందుకే పరీక్షా విధానంలో సమగ్ర సంస్కరణలు అవసరమయ్యాయని తెలిపారు. “పేపర్ లీక్లను అరికట్టేందుకు కఠినమైన చట్టాలు అవసరం. దీనికోసమే పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టాం. రెండు సభల్లోనూ పెద్ద సంఖ్యలో ఎంపీలు దీనిపై విస్తృతంగా చర్చించారు. ఇప్పుడు రెండు సభలు ఈ బిల్లును ఆమోదించాయి. విశ్వసనీయమైన పరీక్షా వ్యవస్థను నిర్మించే దిశగా ఇది ఒక కీలక అడుగు” అని మోడీ తెలిపారు. దేశంలోని ప్రతి ఒక్కరూ కలిసి ముందుకు సాగితేనే ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని సాధించగలమని అన్నారు. పేపర్ లీక్లాంటి పరిస్థితులను ఇకపై ఎక్కువ కాలం కొనసాగనివ్వబోమని స్పష్టం చేశారు.
పేపర్ లీక్లకు భారీ శిక్షలు
కొత్త సవరణ బిల్లులో పేపర్ లీక్లు లేదా పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వ్యక్తులకు కఠిన శిక్షలను ప్రతిపాదించారు.
పేపర్ లీక్ లేదా అక్రమాలకు పాల్పడిన వారికి కనీసం 5 సంవత్సరాలు, గరిష్ఠంగా 10 సంవత్సరాల జైలు శిక్ష.
అదనంగా రూ.50 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం.
వ్యవస్థీకృతంగా (Organised Crime) పేపర్ లీక్లకు పాల్పడితే కనీసం 7 సంవత్సరాల జైలు శిక్ష.
అలాంటి నేరాలకు రూ.10 కోట్లకు తక్కువ కాకుండా జరిమానా విధించే ప్రతిపాదన ఉంది.
రాజ్యసభలో ఆమోదం
పబ్లిక్ ఎగ్జామినేషన్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్) అమెండ్మెంట్ బిల్, 2026 రాజ్యసభలో వాయిస్ ఓటుతో ఆమోదం పొందింది. ఈ సమయంలో పలు ప్రతిపక్ష పార్టీలు సభ నుంచి వాకౌట్ చేశాయి. అంతకుముందు బుధవారం ఈ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఇప్పుడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం కోసం బిల్లు పంపనున్నారు.
బిల్లుపై ప్రతిపక్షాల విమర్శలు
అయితే ఈ బిల్లుపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు చేశాయి. ఇది కేవలం ‘కంటితుడుపు చర్య’ మాత్రమేనని ఆరోపించాయి. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలకు దిగిన విద్యార్థులపై పోలీసులు తీసుకున్న చర్యల విషయంలో ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా క్షమాపణ చెప్పాలని కూడా ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. మరోవైపు బీజేపీ ఎంపీలు ఈ ఆరోపణలను ఖండించారు. విద్యార్థులు లేవనెత్తుతున్న సమస్యల పట్ల కేంద్ర ప్రభుత్వం సున్నితంగా స్పందిస్తోందని, వాటి పరిష్కారం కోసం అవసరమైన చర్యలను ప్రభుత్వం కొనసాగిస్తుందని తెలిపారు. పేపర్ లీక్లు, పరీక్షల్లో అక్రమాలను అరికట్టి విద్యార్థులకు న్యాయం జరిగేలా దేశ పరీక్షా వ్యవస్థను మరింత పారదర్శకంగా, విశ్వసనీయంగా మార్చడమే ఈ సంస్కరణల ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం చెబుతోంది.
Parliament passes a Bill that makes our examination system more robust! pic.twitter.com/OEvLKXoUaf
— Narendra Modi (@narendramodi) July 30, 2026

