Annamalai: తమిళనాడులో పొలిటికల్ హీట్ పీక్స్కి చేరింది. అధికార డీఎంకే, బీజేపీల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు జోరందుకున్నాయి. ఇదిలా ఉంటే కోయంబత్తూర్ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే. అన్నామలై అధికార డీఎంకేపై విరుచుకుపడ్డారు. డీఎంకే పార్టీని ‘దుష్టశక్తి’గా అభివర్ణించారు. ఈ దుష్టశక్తి నుంచి తమిళ ప్రజల్ని ప్రధాని నరేంద్రమోడీ కాపాడుతారని అన్నారు. గురువారం ఆయన డీఎంకే పార్టీ, ప్రభుత్వంపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేశారు. తాను నిఘా నీడలో ఉన్నానని, తన సన్నిహితులపై డీఎంకే నిఘా పెట్టిందని ఆరోపించారు.
Read Also: Pakistan: పేదరికంతో తిండి పెట్టలేక.. భార్య, ఏడుగురు పిల్లల్ని నరికి చంపిన వ్యక్తి..
తమిళనాడులో నీట్ మినహాయింపుతో సహా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ 23 ప్రశ్నలు సంధించడంపై అన్నామలై విలేకరులతో మాట్లాడారు. గోపాలపురంకి చెందిన అవినీతి రాజకీయ నాయకులను శిక్షిస్తానని మోడీ హామీ ఇచ్చారని, ఇది డీఎంకేకి సూచన అని అన్నారు. తమిళ ప్రజలకి డీఎంకే కుటుంబ పాలన నుంచి విముక్తి చేస్తామని అన్నారు. వేర్పాటువాదంపై మాట్లాడే వారిని నిలువరిస్తామని చెప్పారు.
తమిళనాడులోని పోలీస్ ఇంటెలిజెన్స్ విభాగం తనపై, తన కుటుంబ సభ్యులపై, స్నేహితులపై నిఘా పెట్టిందని అన్నామలై పేర్కొన్నారు. కోయంబత్తూర్లో పార్టీ ఆఫీస్ బేరర్లు, మద్దతుదారులపై నిఘా పెట్టేందుకు ఇంటెలిజెన్స్ నిఘా విభాగాన్ని ఏర్పాటు చేశారని ఆరోపించారు. 2024 లోక్సభ ఎన్నికల తర్వాత ప్రతీ అధికారి సమాధానాలు చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు. డీఎంకేకి వ్యతిరేకంగా రాజకీయాలు చేయడం అంత తేలికైన పని కాదని అన్నారు. తనకు పూలమాలలు వేసి స్వాగతం పలికిన పారిశ్రామికవేత్తల్ని బెదిరిస్తున్నారని అన్నామలై ఆరోపించారు. తాను ఓ విద్యాసంస్థను సందర్శించిన సమయంలో విద్యుత్ కోతల్ని ఎదుర్కోవాల్సి వచ్చిందని అన్నారు. ఇది ప్రజాస్వామ్యమా..? రాష్ట్రంలో నిజాయితీ పాలన ఉందా..? అని ప్రశ్నించారు.
