పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచ దేశాల్లో గ్యాస్, చమురు సంక్షోభాలు నెలకొన్నాయి. ఆయా దేశాల్లో గ్యాస్ సంక్షోభం తీవ్రంగా ఉంది. భారత్ మాత్రం ప్రస్తుతం సేఫ్ జోన్లో ఉంది. ఇప్పటి వరకైతే ఎలాంటి ఇబ్బందులు కనబడలేదు. కానీ సోషల్ మీడియా పుకార్లు కారణంగా అవసరం ఉన్నా.. లేకున్నా గ్యాస్ బండ్లను భద్రత చేసుకుంటున్నారు. గ్యాస్ ఏజెన్సీల దగ్గర పెద్ద ఎత్తున గృహ వినియోగదారులు క్యూలు కడుతున్నారు.
ఇలాంటి తరుణంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వంటింటి గుట్టును బయటపెట్టారు. గ్యాస్ సంక్షోభం వేళ తన భార్య ట్వింకిల్ ఖన్నా ముందు జాగ్రత్తగా రెండు ఎలక్ట్రిక్ స్టవ్లను ఆర్డర్ చేసిందని తెలిపారు. ఆ రెండు స్టవ్లు ఇంకా ఇంటికి చేరాయో లేదో కూడా తనకు తెలియదంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉంటే దేశంలో గ్యాస్ సంక్షోభం లేదని కేంద్రం తెలిపింది. పెట్రోలియం అండ్ సహజ వాయువుల మంత్రిత్వ శాఖ, జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ మాట్లాడుతూ.. దేశంలో పెట్రోల్, డీజిల్ తగినంత పరిమాణంలో అందుబాటులో ఉందని హామీ ఇచ్చారు. ఎవరూ ఎలాంటి ఆందోళనలు చెందక్కర్లేదని భరోసా ఇచ్చారు. ‘‘సహజ వాయువు విషయానికి వస్తే నేను మీకు చెప్పినట్లుగా భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. వాణిజ్య ఎల్పీజీ వినియోగదారులందరూ పీఎన్జీకి మారితే ప్రయోజనకరంగా ఉంటుంది.’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతానికైతే ఎల్పీజీ, పెట్రోలియం సరఫరాలు స్థిరంగా ఉన్నాయని స్పష్టం చేశారు. భారత చమురు ట్యాంకర్ ‘‘జగ్ లాడ్కి’’ ఫుజైరా నుంచి భారతదేశానికి ముడి చమురును తీసుకువస్తూ సురక్షితంగా బయలుదేరిందని వెల్లడించారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండేందుకు దేశవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తులు, వంటగ్యాస్ నిరంతరాయంగా లభించేలా తగిన చర్యలు తీసుకున్నట్లుగా తెలిపారు.
ఇక ఎల్పీజీ సిలిండర్ల కోసం భయాందోళనలతో బుకింగ్ చేసుకోవద్దని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. దేశంలో ఎక్కడా కూడా ఎల్పీజీ పంపిణీ కేంద్రాల దగ్గర సరఫరా నిలిచిపోయినట్లుగా నివేదికలు రాలేదని పేర్కొంది. అయినప్పటికీ అధిక సంఖ్యలో కాల్స్ రావడం వల్ల కొన్ని గ్యాస్ డిపోల దగ్గర వ్యవస్థకు అంతరాయాలు ఏర్పడి.. పొడవైన క్యూలు ఏర్పడినట్లుగా అభిప్రాయపడింది.
