Air India: ఢిల్లీ నుంచి అమృత్సర్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం కొద్దిసేపు పాకిస్తాన్ గగనతరంలోకి ప్రవేశించింది. ఈ ఘటన జూన్ 22న జరిగింది. అమృత్సర్ విమానాశ్రయంలో ల్యాండింగ్ అయ్యే ముందు విమానం ‘‘గో-అరౌండ్’’ ప్రక్రియలో భాగంగా అటారీ సరిహద్దును దాటినట్లు తెలుస్తోంది. ఫ్లైట్ డేటా ప్రకారం, ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI479 రెండు నిమిషాల పాటు పాకిస్తాన్ గగనతలంలో ఉంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్, పాక్లు ఒకరినొకరు తమ గగనతలాన్ని మూసివేస్తున్నన్న విషయం తెలిసిందే.
ఎయిర్బస్ A321 విమానం ఢిల్లీ నుంచి రాత్రి 9:18 గంటలకు బయలుదేరి, అమృత్సర్లో రాత్రి 10:30 గంటలకు ల్యాండ్ కావాల్సి ఉంది. అమృత్సర్ విమానాశ్రయంలో అధికా ఎయిర్ ట్రాఫిక్, ఆపరేషనల్ కారణాల వల్ల ల్యాండింగ్ అనుమతి రాలేదు. ఆ తర్వాత అమృత్సర్ విమానాశ్రయంలో కొద్దిసేపు చక్కర్లు కొట్టింది. ఆ తర్వాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ) ఆ విమానాన్ని ఢిల్లీకి తిరిగి వెళ్లాల్సిందిగా ఆదేశించింది. దీని తర్వాత ఢిల్లీ చేరుకున్న విమానానికి సాంకేతిక తనిఖీలు నిర్వహించారు. అవసరమైన అనుమతులు పొందిన తర్వాత మళ్లీ అదే విమానాన్ని అమృత్సర్ పంపించారు. చివరకు మంగళవారం తెల్లవారుజామున 2.20 గంటలకు అక్కడ ల్యాండ్ అయింది. దీంతో ప్రయాణికులు దాదాపుగా 4 గంటల ఆలస్యాన్ని ఎదుర్కొన్నారు.
విమానం తమ గగనతలంలోకి వచ్చిననట్లు గమనించిన పాక్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఈ విషాయాన్ని వెల్లడించి అప్రమత్తం చేసింది. దీంతో వెంటనే విమానం తిరిగి భారత్ ఎయిర్ స్పేస్లోకి వచ్చింది. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘‘జూన్ 22న ఢిల్లీ-అమృత్సర్ AI479 విమానం గో-అరౌండ్ ప్రక్రియలో భాగంగా కొద్దిసేపు పాకిస్థాన్ గగనతలాన్ని ఉల్లంఘించింది. ఈ విషయాన్ని సంబంధిత నియంత్రణ సంస్థలకు తెలియజేశాం. ప్రస్తుతం అంతర్గత విచారణ కొనసాగుతోంది. ప్రయాణికులు, సిబ్బంది భద్రతే మా అత్యున్నత ప్రాధాన్యత’’ అని పేర్కొంది.

