Air India New CEO: టాటా గ్రూప్కు చెందిన ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్గా ‘‘టెవోల్డే గెబ్రెమారియం(Tewolde Gebremariam) నియమితులయ్యారు. అయితే, ఆయన నిజానికి పాకిస్తాన్కు చెందిన పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్(PIA)కు సీఈఓగా వెళ్లాల్సిందని, సెక్యూరిటీ క్లియర్సెన్స్ పూర్తయ్యాక ఆయన పేరు ప్రతిపాదించాలని పీఐఏ భావించిందని, ఆలోపే ఎయిర్ ఇండియా అతడిని కొత్త సీఈఓగా నియమించినట్లు తెలుస్తోంది.
భారీ నష్టాల్లో ఉన్న పీఐఏను పాకిస్తాన్ ప్రైవేటీకరణ చేసింది. ఇప్పుడు ఆ సంస్థను లాభాల బాట పట్టించే బాధ్యతల్ని టెవోల్డేకు అప్పగించాలని పాక్ భావించింది. విమానాల ఆధునీకీకరణ, ఇంటర్నేషనల్ మార్గాల విస్తరణ, ఆపరేషనల్ సంస్కరణతో పునరుద్ధరించాలని పీఐఏ భావించింది. అయితే, భద్రతా పరమైన అనుమతులు పూర్తవ్వకపోవడంతో ఆ నియామకాన్ని అధికారికంగా ప్రకటించలేదు.
ఇదే సమయంలో ఎయిర్ ఇండియా వ్యూహాత్మకంగా వ్యవహరించి టెవోల్డేను కొత్త సీఈఓగా నియమించింది. ప్రపంచంలో లాభాల్లో ఉన్న అతిపెద్ద ఎయిర్ లైన్ సంస్థల్లో ఒకటిగా ఉన్న, ఆఫ్రికాకు చెందిన ఇథియోపియన్ ఎయిర్లైన్స్ గ్రూప్ సీఈఓగా టెవోల్డే పనిచేశారు. 2011 నుంచి 2022 వరకు ఈ ఎయిర్ లైన్స్ ఎదుగుదలకు కారణమయ్యారు. ఇథియోపియన్ రాజధాని అడిస్ అబాబాను ఆఫ్రికాలోనే కీలకమైన విమానయాన కేంద్రంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారు. విమానాల సంఖ్య, అంతర్జాతీయ మార్గాలు, నిర్వహణ సామర్థ్యాలను గణనీయంగా విస్తరించడానికి దోహదపడ్డారు.
2022లో ఆరోగ్య కారణాలతో పదవీ విరమణ చేసిన ఆయన, ఇప్పుడు ఎయిర్ ఇండియాకు నాయకత్వం వహించనున్నారు. సీఈఓ నియామకంపై టెవోల్డే మాట్లాడుతూ.. ఎయిర్ ఇండియాకు నాయకత్వం వహించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. సంస్థను మరింత విశ్వసనీయత, లాభదాయకంగా, ప్రపంచస్థాయిలో పోటీ పడే ఎయిర్ లైన్గా తీర్చిదిద్దానని చెప్పారు.

