Asaduddin Owaisi: వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోయే పశ్చిమ బెంగాల్లో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ఇటీవల, ముర్షిదాబాద్లోని బెల్దంగా ప్రాంతంలో ‘‘బాబ్రీ మసీదు’’ నిర్మిస్తానని చెప్పి, శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఈ వివాదంతో సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) కబీర్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దీనిపై, కబీర్ మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో మమతా బెనర్జీ మాజీ సీఎం అవుతారని అన్నారు. ముస్లింల ఓట్ బ్యాంక్ను కోల్పోతారని చెప్పారు.
Read Also: Pakistan: పాక్ యూనివర్సిటీలో సంస్కృతం, మహాభారతం.. మీరు వింటున్నది నిజమే..
వచ్చే ఎన్నికల నాటికి కొత్త పార్టీని ఏర్పాటు చేసి, అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎంతో పొత్తు పెట్టుకుంటామని ప్రకటించారు. అయితే, ఈ ప్రకటనపై ఎంఐఎం పశ్చిమ బెంగాల్ యూనిట్ స్పందించింది. పొత్తుపై ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ప్రస్తుతం, రెండు పక్షాల మధ్య చర్చలు జరుగుతున్నాయని, బెంగాల్లో సీట్లలో పొత్తు కుదురుతుందని ఎంఐఎం బెంగాల్ చీఫ్ ఇమ్రాన్ సోలంకి చెప్పారు. తాను హుమాయున్ కబీర్తో మాట్లాడానని, ఓవైసీకి దేశవ్యాప్తంగా ఇమేజ్ ఉన్న కారణంగా ఎంఐఎంతో పొత్తును కోరుకుంటున్నారని, మేము కూడా కబీర్తో పొత్తు పెట్టుకోవాలని అనుకుంటున్నానని, అయితే తుది నిర్ణయం ఓవైసీ తీసుకుంటారని ఇమ్రాన్ చెప్పారు.
టీఎంసీ నుంచి సస్పెండ్ అయిన కబీర్, మమతా బెనర్జీకి కీలకంగా ఉన్న ముస్లిం ఓట్ బ్యాంక్ను టార్గెట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను కింగ్ మేకర్ కావాలని ఆశిస్తున్నారు. డిసెంబర్ 22న తన సొంత పార్టీని ప్రారంభిస్తారని చెప్పారు. మైనారిటీ ఓట్లతో గెలిచినప్పటికీ, మమతా వారిని నిర్లక్ష్యం చేసినట్లు ఇమ్రాన్ ఆరోపించారు.
