Tamil Nadu Assembly election 2026: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.. చెన్నైలోని గుమ్మడిపూండి నియోజకవర్గంలో నామినేషన్ ప్రక్రియ సందర్భంగా ఈ ఘటన వెలుగుచూసింది.. రాజకీయంగా ప్రత్యర్థి పార్టీలకు చెందిన ఇద్దరు అభ్యర్థుల మధ్య జరిగిన ఈ సంఘటన అక్కడ ఉన్నవారిని ఆశ్చర్యానికి గురిచేసింది. ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) తరఫున టీజే గోవిందరాజన్ నామినేషన్ దాఖలు చేసి బయటకు వస్తుండగా, అదే సమయంలో అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం అభ్యర్థి సుధాకర్ నామినేషన్ వేయడానికి అక్కడికి వచ్చారు. ఈ క్రమంలో సుధాకర్ అకస్మాత్తుగా గోవిందరాజన్ వద్దకు వెళ్లి ఆయన పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు.
Read Also: Yuvraj Singh: “ఎక్కడి నుంచో వచ్చాడు.. కెప్టెన్ అయ్యాడు”.. ధోనిపై యూవీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
ఈ సంఘటనతో అక్కడి రాజకీయ వర్గాలు, కార్యకర్తలు కొద్దిసేపు ఆశ్చర్యంలో మునిగిపోయారు. అయితే గోవిందరాజన్ కూడా నవ్వుతూ సుధాకర్ను దగ్గరకు తీసుకుని ఆశీర్వదించడం మరింత ఆసక్తికరంగా మారింది. సుధాకర్ సన్నిహితులు తెలిపిన వివరాల ప్రకారం, గతంలో సుధాకర్ గోవిందరాజన్ వద్ద అనుచరుడిగా పనిచేశారని, అదే గౌరవంతో ఆయన పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారని చెప్పారు. రాజకీయంగా విభిన్న పార్టీల్లో ఉన్నప్పటికీ వ్యక్తిగత సంబంధాలు ఎలా ఉంటాయో ఈ సంఘటన స్పష్టంగా చూపించింది. ఈ ఘటన ప్రస్తుతం చెన్నై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.