Abhijeet Dipke: నీట్ పేపర్ లీక్పై విద్యార్థి ఉద్యమాన్ని ఈ స్థాయికి తీసుకువచ్చిన ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్పై కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) అధినేత అభిజిత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు చేశారు. 26 రోజలు నిరాహార దీక్ష తర్వాత ప్రభుత్వ హామీలతో దీక్ష విరమించిన వాంగ్చుక్ కోరితే దీక్ష విరమిస్తారా? అని అడిగితే దీప్కే నుంచి ‘‘లేదు’’ అనే సమాధానం వచ్చింది. ఈ ఉద్యమం నాదో లేదా సోనమ్ వాంగ్చుక్, కాంగ్రెస్ పార్టీదో కాదని, ఇది దేశవ్యాప్త యువత ఉద్యమంగా మారిందని అన్నారు. అన్ని రాష్ట్రాల్లో నిరసనలు కొనసాగుతున్నాయని, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తప్ప మరో మార్గం లేదని చెప్పారు. మరోవైపు, కాంగ్రెస్ కూడా వాంగ్ చుక్పై విమర్శలు చేస్తోంది. వాంగ్చుక్ కేంద్ర ప్రభుత్వానికి వంతపాడం సరైంది కాదని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు.
ఇదిలా ఉంటే, ఈ రోజు కేంద్రం, సీజేపీ మధ్య చర్చలు జరిగాయి. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, విద్యార్థులపై కేసులు ఎత్తివేయడం, ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు రూ. 1 కోటి నష్టపరిహారం ఇవ్వడం వంటి మూడు డిమాండ్లను సీజేపీ కేంద్రం ముందుంచింది. కేసుల విత్ డ్రా, పరిహారంపై కేంద్రం సానుకూలంగా ఉన్నప్పటికీ, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై కేంద్రం ఒక రోజు గడువు కోరిందని సీజేపీ ప్రతినిధులు చెప్పారు. మరోవైపు, పేపర్ లీక్లపై ఉక్కుపాదం మోపేందుకు పబ్లిక్ ఎగ్జామినేషన్ (సవరణ) బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రేపు మరోసారి సీజేపీ, కేంద్రం మధ్య చర్చలు జరగనున్నాయి.

